కూతురు పెళ్లి రోజే తండ్రి హఠాన్మరణం.. అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తునే..

20 Jun, 2022 21:25 IST|Sakshi
మక్బుల్‌ అహ్మద్‌ (ఫైల్‌)

పుల్‌కల్‌(సంగారెడ్డి): మరో గంటలో కూతురు పెళ్లి. బంధువులు, కుటుంబ సభ్యులు ముస్తాబవుతున్నారు. కూతురు పెళ్లిని అంగరంగ వైభవంగా చేయాలనుకున్న ఆ నాన్న కల నెరవేరకుండానే కన్నుమూసాడు. ఫాదర్స్‌ డే రోజు తండ్రిని పోగొట్టుకుని ఆ కూతురు శోకసంద్రంలో మునిగిపోయింది. బంధువులు ఓవైపు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తునే నిఖా తంతు ముగించారు. ఈ హృదయ విదారకర సంఘటన సంగారెడ్డి జిల్లా పుల్‌కల్‌ మండలంలోని ముద్దాయిపేటలో ఆదివారం జరిగింది. 

వివరాల్లోకి వెళ్తే.. ముద్దాయిపేటకు చెందిన మక్బుల్‌ అహ్మద్‌(గూడు పటేల్‌)కూతురికి సంగారెడ్డికి చెందిన యువకుడితో పెళ్లి నిశ్చయించారు. మూడు నెలల క్రితం ఎంగేజ్‌మెంట్‌ ఘనంగా చేశారు. ఆదివారం సంగారెడ్డిలో వివాహ ఏర్పాట్లు చేశారు. బంధువులందరు పెళ్లి మండపానికి చేరుకున్నారు. మహ్మద్‌ మక్బుల్‌ అహ్మద్‌ అస్వస్థతకు గురవడంతో ఇంట్లోనే ఉంచారు. పెళ్లి మరో గంట ఉందనగా పెళ్లి పెద్ద మృతిచెందాడు. బంధువులు కొందరు కూతురు పెళ్లి తంతు ముగించగా,మరికొందరు తండ్రి అంత్యక్రియలు పూర్తిచేశారు.
చదవండి👉🏻 మరణించి ఉంటారులే.. బతికి ఉన్న మహిళ పోస్టుమార్టానికి..

మరిన్ని వార్తలు