లక్షణాలు లేకున్నా, తక్కువగా ఉన్నా హోం ఐసోలేషన్
అసింప్టమాటిక్ అయితే విటమిన్ ట్యాబ్లెట్లతో సరి
లక్షణాలుంటే మాత్రం వైద్యుల సూచనల మేరకు మందులు
రోగనిరోధక శక్తి పెంచుకోవడంపై దృష్టిపెట్టాలి
హోం ఐసోలేషన్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నిపుణుల సూచనలివీ..
సాక్షి, హైదరాబాద్: కరోనా ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తితో ఎక్కువ మంది బాధితుల్లో లక్షణాలు పెద్దగా కనిపించడం లేదు. 60 శాతం మంది అసింప్టమాటిక్గా, మరో 30 శాతం మందిలో స్వల్ప లక్షణాలు ఉంటున్నట్టు వైద్యారోగ్య శాఖ వర్గాలు చెప్తున్నాయి. లక్షణాలు లేనివారు, స్వల్ప లక్షణాలు కలిగిన వారు హోం ఐసోలేషన్లోనే ఉండాలని ఐసీఎంఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్) మార్గదర్శకాల్లో సూచించింది. అంటే కరోనా పాజిటివ్ వస్తున్నవారిలో 90 శాతం మంది హోం ఐసోలేషన్లోనే ఉంటున్నారు. ఈ క్రమంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే సందేహాలు చాలా మందిలో వ్యక్తమవుతున్నాయి. దీనికి సంబంధించి రాష్ట్ర వైద్యారోగ్య శాఖ, సీనియర్ వైద్య నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు. ఒమిక్రాన్ వేరియంట్కు వేగం ఎక్కువని, ఇంట్లో ఒకరికి వస్తే తక్కువ సమయంలోనే కుటుంబ సభ్యులకూ సోకే అవకాశాలు ఎక్కువని స్పష్టం చేస్తున్నారు. అందువల్ల ప్రతి ఒక్కరూ తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు.
ఈ జాగ్రత్తలు పాటిస్తే సరి
సరైన ఆహారం తీసుకోవడం కీలకం
కోవిడ్ వ్యాప్తి చెందుతున్న వారిలో చాలా మందికి ఆహారాన్ని తీసుకోవాలనిపించడం లేదు. ఆకలిగా ఉన్నప్పటికీ తినాలనే ఉత్సాహం లేకపోవడంతో ఇన్టేక్ తక్కువగా ఉంటుంది. ఇది ప్రమాదకరం. రోజుకు 3 పూటలా తాజాగా వండిన ఆహారాన్ని తప్పకుండా తీసుకోవాలి. మెనూలో మార్పులు లేకున్నా ఇంట్లో రోజువారీగా తీసుకునే ఆహారాన్ని కడుపునిండా తినాలి. సరైన ఆహారం తీసుకుంటేనే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా ప్రమాదాన్ని కోరి తెచ్చుకున్నట్లే. – డాక్టర్ హెప్సిబా,
మెడికల్ ఆఫీసర్, హైదరాబాద్
కోలుకున్నవారు సపర్యలు చేయొచ్చు..
ఇంట్లో ఒకరికి కోవిడ్ వస్తే.. ఇతరులకు సొకే అవకాశం ఉంటుంది. ఒకరికి హోం ఐసోలేషన్ పూర్తయ్యాక కుటుంబంలో ఇంకొకరికి వైరస్ సోకొచ్చు. అలాంటప్పుడు ఐసోలేషన్ ముగిసినవారు ఇతర బాధితులకు సపర్యలు చేయొచ్చు. అయినా భౌతికదూరం పాటించడం మంచిది.
ఒక ఇంట్లో తల్లిదండ్రులిద్దరికీ కోవిడ్ వస్తే పిల్ల లకు కూడా వచ్చే ప్రమాదం ఉంది. పిల్లలకు నెగెటివ్ వచ్చినా జాగ్రత్తలు పాటించాలి.