కరోనా మానసిక సమస్యలకు ఓపీ

25 Jun, 2021 08:59 IST|Sakshi

జిల్లా, బోధనాస్పత్రుల్లో ప్రత్యేక ఏర్పాట్లు 

నోడల్‌ కేంద్రంగా ఎర్రగడ్డ ఆస్పత్రి  

సాక్షి, హైదరాబాద్‌: కరోనా బాధితుల మానసిక ఆరోగ్యంపై రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. అందుకు సంబంధించి ఇప్పటికే ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. వారిలో తలెత్తే మానసిక సమస్యలను పరిష్కరించేందుకు అన్ని బోధనా, జిల్లా ఆస్పత్రుల్లో ప్రత్యేక ఓపీని నిర్వహిస్తున్నామని వెల్లడించింది. ఎర్రగడ్డలోని మానసిక చికిత్సాలయాన్ని నోడల్‌ కేంద్రంగా ప్రకటించింది. మానసిక బాధితులకు అవసరమైన కౌన్సెలింగ్, వైద్య సేవలందించడానికి వైద్యులు, ఇతర సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చినట్లు అధికారులు వెల్లడించారు. జనరల్‌ ఫిజీషియన్లు కూడా వీటిపై దృష్టిసారించారు. మెరుగైన సేవలందించాలని భావిస్తే మానసిక వైద్యులున్న ఆస్పత్రులకు తరలిస్తున్నారు. తొమ్మిది ప్రభుత్వ బోధనాస్పత్రుల్లో 21 మంది సైకియాట్రిస్టులు, 42 మంది సీనియర్‌ రెసిడెంట్లు బాధితులకు సేవలందించడంలో కృషిచేస్తున్నారని అధికారులు వెల్లడించారు. అలాగే తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ (టీవీవీపీ) ఆస్పత్రుల్లోనూ 21 మంది మానసిక వైద్యనిపుణులు అందుబాటులో ఉన్నారు.  

కుటుంబ సభ్యులకు సమాచారం 
ప్రభుత్వ ఆస్పత్రుల్లో కరోనా బాధితుడి అనారోగ్యం, మానసిక స్థితిగతుల గురించి ఎప్పటికప్పుడు కుటుంబ సభ్యులకు తప్పనిసరిగా తెలియజేస్తున్న ట్లు అధికారులు తెలిపారు. కోలుకున్న తర్వాత ఇం టి వద్ద కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో రోగులకు, వారి కుటుంబ సభ్యులకు వివరిస్తున్నా రు. మద్యం అలవాటు ఉన్నవారిలో విపరీతమైన ఆందోళన, మళ్లీ మద్యం తీసుకోవాలనే బలమైన కోరికలున్నప్పుడు వాడాల్సిన మందులు, జాగ్రత్తల ను వివరిస్తున్నారు. లక్షణాలు తీవ్రమైతే సమీపం లోని మానసిక వైద్యుడిని కలవాల్సిన పరిస్థితులపై ముందే రోగికి, కుటుంబ సభ్యులకు అవగాహన కల్పిస్తున్నారు. అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ మానసిక సమస్యలకు చికిత్స అందించడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు.   
 

మరిన్ని వార్తలు