అంబులెన్స్‌ లేదు.. పీహెచ్‌సీకి తాళం.. ఆటోలోనే ప్రసవించిన మహిళ

29 Dec, 2021 09:28 IST|Sakshi

అందుబాటులో లేని 108 సర్వీస్‌

అమ్మ ఒడి అంబులెన్స్‌కు డీజిల్‌ కరువు

సాక్షి, ఆదిలాబాద్‌(గాదిగూడ): బిడ్డకు జన్మనివ్వడమంటే ఓ మహిళకు పునర్జన్మగా భావిస్తారు. అలాంటి ప్రసవ సమయంలో పరిస్థితులు అన్ని సాఫీగా ఉంటేనే ఎలాంటి వేదన ఉండదు.. కానీ ఆదిలాబాద్‌ జిల్లాలో గిరిజనులకు కష్టాలు తప్పడం లేదు. ప్రసవం కోసం ఆస్పత్రికి వెళ్లేందుకు 108 వాహనం, అమ్మఒడి అంబులెన్స్‌ అందుబాటులో లేకపోవడంతో ఓ గిరిజన మహిళ ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో ఆటోలోనే బిడ్డకు జన్మనిచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. గాదిగూడ మండలం కూనికాస గ్రామానికి చెందిన ఆత్రం గంగాదేవికి మంగళవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో పురిటినొప్పులు ప్రారంభమయ్యాయి.
చదవండి: తెలంగాణ: జైళ్లలో మగ్గుతున్న యువత.. హత్యలు, లైంగిక దాడులే అధికం.. 

దీంతో కుటుంబ సభ్యులు 108కు సమాచారం అందించారు. మండల కేంద్రంలో వాహనం అందుబాటులో లేదని వారు సమాచారం ఇచ్చారు. అమ్మఒడి వాహనం కోసం సంప్రదించినా డీజిల్‌ లేదని సిబ్బంది చెప్పారు. తప్పనిసరి పరిస్థితుల్లో కుటుంబ సభ్యులు ఆటో సాయంతో గంగాదేవిని గాదిగూడ పీహెచ్‌సీకి మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో తీసుకెళ్లారు. అయితే పీహెచ్‌సీకి తాళం వేసి ఉండటంతో అదే ఆటోలో నార్నూర్‌ మండలంలోని ఝరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మారేగావ్‌ సమీపంలో ఆశ కార్యకర్త కె.జారుబాయి సాయంతో గంగాదేవి పండంటి మగశిశువుకు జన్మనిచ్చింది. అనంతరం తల్లీబిడ్డలను ఝరి పీహెచ్‌సీకి తరలించారు. అక్కడ కూడా వైద్యులు అందుబాటులో లేకపోవడంతో స్టాఫ్‌నర్స్‌ వైద్యమందించడం గమనార్హం.  
చదవండి: ఐటీ కంపెనీలపై ఒమిక్రాన్‌ ఎఫెక్ట్‌.. ఇంకొంత కాలం ఇంటి నుంచే! 

మరిన్ని వార్తలు