TRS Formation Day: టీఆర్‌ఎస్‌ ప్లీనరీ వేడుకలు 2022.. లైవ్‌ అప్‌డేట్స్‌

27 Apr, 2022 16:22 IST|Sakshi

ప్లీనరీ అప్‌డేట్స్‌:
👉కేసీఆర్‌ విజన్‌ ఉన్ననేత అని మంత్రి కేటీఆర్‌ కొనియాడారు. ఎన్టీఆర్‌, కేసీఆర్‌ మాత్రమే తెలుగు ప్రజల గుండెలో చెరగని ముద్ర వేశారని అన్నారు. ఈ రోజు తెలంగాణలో ఆచరిస్తున్నది.. దేశ వ్యాప్తంగా ఆచరించే పరిస్థితులు వస్తున్నాయని తెలిపారు.

👉రైతుబంధు పథకం కేంద్రానికి ప్రేరణ అయ్యిందన్నారు. తెలంగాణ పథకాలను పేరుమార్చి కేంద్రం కాపీకొడుతోందన్నారు. టీఎస్‌ ఐపాస్‌లాగా కేంద్ర సింగిల్‌ విండో తీసుకొచ్చిందన్నారు. దేశంలో ఒక్క తెలంగాణలోనే రైతులకు 24 గంటల కరెంట్‌ అందుతోందన్నారు.

👉బీజేపీ నేతలు ఆత్మనిర్భర్‌ భారత్‌ అంటారనీ.. కానీ బతుకు దుర్భర్‌ భారత్‌ అయ్యిందని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. ఆకలి సూచీల్లో మనం ఎక్కడో ఉన్నామనీ.. పాక్‌, బంగ్లాదేశ్‌ మనకన్నా ముందన్నాయనీ.. ఇది బీజేపీ పాలనా తీరని ధ్వజమెత్తారు.

👉బుధవారం టీఆర్‌ఎస్‌ ప్లీనరీలో కేంద్ర ప్రభుత్వం సెస్‌ల రూపంలో వసూలు చేసే మొత్తాన్ని డివిజనల్‌ పూల్‌లోకి తేవాలని డిమాండ్‌ చేస్తూ తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రానే రాదన్న తెలంగాణ సాధించి, దేశంలో ఆదర్శ రాష్ట్రంగా సీఎం కేసీఆర్‌ నిలపారన్నారు.

► టీఆర్‌ఎస్‌ ప్లీనరీ సమావేశాలకు భోజన విరామం. లంచ్‌ అనంతరం తిరిగి ప్రారంభం కానున్న సమావేశం.

► హరీశ్‌ రావు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని.. చెవెళ్ల పార్లమెంట్‌ సభ్యులు మన్య రంజిత్‌ రెడ్డి తీర్మానాన్ని బలపరిచారు.

► కేంద్రంలో ఉంది సంకుచిత ప్రభుత్వం. బీజేపీ అధికారంలోకి వచ్చాక పన్నులు పెరిగాయి. అప్పుల విషయంలోనూ కేంద్రానికో నీతి, రాష్ట్రానికో నీతి ఉంటుందా? ఆంక్షలు ఎందుకు? బీజేపీకి రాజకీయమే తప్ప ప్రజాసంక్షేమం పట్టదు. ఈ అంశాలపై పోరాడాల్సిన అవసరం ఉందని హరీష్‌ రావు పేర్కొన్నారు.

► కేంద్రం బాగుపడాలి.. రాష్ట్రాలు నష్టపోవాలి అన్నట్లుంది కేంద్రం తీరు: టీఆర్‌ఎస్‌ నేత హరీష్‌ రావు

► రాష్ట్రాల ఆదాయానికి గండి కొడుతూ కేంద్రం పన్నుల రూపంలో కాకుండా సెస్‌ల రూపేణా వసూలు చేయడం మానుకోవాలని, డివిజబుల్‌ పూల్‌లోనే పన్నులు వసూలు చేయాలని మంత్రి హరీశ్‌ రావు తీర్మానం ప్రవేశపెట్టారు.

► ధాన్యం కొనుగోలు తీర్మానాన్ని బలపర్చిన మంత్రి గంగుల కమలాకర్‌.

► యాసంగిలో వరి ధాన్యాన్ని కేంద్రం కొనకపోయినా రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నందుకు అభినందన తీర్మానాన్ని వ్యసాయశాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి ప్రతిపాదించారు.

ప్లీనరీలో టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు ప్రసంగం

దేశ పరిస్థితిని గాడిన పెట్టే శక్తులు తప్పకుండా వస్తాయి. తెలంగాణ కోసం టీఆర్‌ఎస్‌ పుట్టుకురాలేదా? అలాగే దేశానికి అవసరమైనప్పుడు.. దుర్మార్గాన్ని తరిమేసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. ఇందుకోసం టీఆర్‌ఎస్‌ కూడా కీలక పాత్ర పోషిస్తోందని చెప్పారు సీఎం కేసీఆర్‌.

► పుల్వామా, సర్జికల్‌ స్ట్రయిక్స్‌, కశ్మీర్‌ ఫైల్స్‌ అంటూ.. మానిన గాయాలను మళ్లీ రేపుతున్నారు. 

► దేశ రాజధాని దేవుడి పేరుతో మారణాయుధాలతో ఉరేగింపా? .. ఈ దౌర్భాగ్య పరిస్థితి దేశానికి మంచిది కాదు. దేశానికి మంచి మార్గం చూపించొద్దా?

► దేశం ఉజ్వలమైన భవిష్యత్‌ కోసం మన పాత్ర పోషించాలి. 

► జాతిపితగా పేరు తెచ్చుకున్న వ్యక్తినే దుర్భాషలాడుతారా? ఆయన్ని చంపిన హంతకులను పూజిస్తారా? ఏ దేశమైన ఇలా చేస్తుందా? ఇదేం పెడ ధోరణి? ఇదేం సంస్కృతి.

► ప్రజలకు అనుకూలమైన ఫ్రంట్‌ రావాలి. తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితి చేసి దేశం కోసం ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నారు. దేశ స్థితిని, గతిని మార్చేలా హైదరాబాద్‌ వేదికగా కొత్త ఎజెండా రూపొందితే.. అది మనకే గర్వకారణం. 

► ప్రధాని సొంత రాష్ట్రం సహా దేశంలో కరెంట్‌కోతలు కొనసాగుతుంటే.. తెలంగాణ మాత్రం వెలుగు జిలుగులని గర్వంగా చెప్తున్నా. తాగునీరు, కరెంట్‌ అందలేని పరిస్థితులు. వాళ్ల ఉపన్యాసాలు వింటే మైకులు పగిలిపోతాయని అన్నారు. 

► వాగ్దానాలు ఎక్కువ.. పని తక్కువ. ఇంత దుస్థితి ఎందుకు? ఎవరి అసమర్థత? వనరులు లేవంటే వేరు.. కానీ, ఉండి కూడా అందించలేని పరిస్థితి అని తెలిపారు. 

► తెలంగాణ రాష్ట్రం పని చేసిన పద్ధతిలో దేశం పని చేసి ఉంటే.. ఫలితం మరోలా ఉండేది. కరెంట్‌ దగ్గరి నుంచి ప్రతీదాంట్లోనూ పురోగతి ఉండేదని సీఎం కేసీఆర్‌ అన్నారు. ఈ మాట కాగ్‌, ఆర్థిక నిపుణులు సహా పలు నివేదికలు చెప్తున్న మాట. 

► ఒకప్పుడు తెలంగాణ కరువు కాటకాలకు నెలవు. ఇప్పుడు జలధారకు నెలవు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు కాళేశ్వరం. 

► అన్నింట్లోనూ తెలంగాణ నెంబర్‌ వన్‌గా ఉంది. 

► ఏ రంగం తీసుకున్నా అద్భుతమైన ఫలితాలు సాధించాం.

► తెలంగాణలో అవినీతి మంత్రులు లేరు. 

► డబ్బాలు కొట్టుకోవడం, అతిగా పొగుడుకోవాల్సిన అవసరం తెలంగాణకు లేదు. దేశంలో పది ఉత్తమమైన గ్రామాలు  తెలంగాణావే. కేంద్రం ఇచ్చిన ఈ సర్టిఫికెట్టే అందుకు నిదర్శనం.

► దేశానికి తెలంగాణ పాలన రోల్‌ మోడల్‌. సాధించుకున్న రాష్ట్రాన్ని సుభిక్షంగా తీర్చిదిద్దుకుంటున్నాం. 

► తెలంగాణకు టీఆర్‌ఎస్‌ కంచుకోట.. ఎవరూ బద్దలు కొట్టలేని రక్షణ కవచం. టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రజల ఆస్తి.

► అనుకున్న లక్ష్యాలను ముద్దాడి, రాష్ట్ర కాంక్షను సాధించుకున్న పార్టీ తెలంగాణ రాష్ట్రసమితి. 

► 60 లక్షల మంది పార్టీ సభ్యులతో.. వెయ్యి కోట్ల ఆస్తులున్న పార్టీ టీఆర్‌ఎస్‌. 

► ఇరవై ఏళ్లు పూర్తి చేసుకుని 21వ ఏట అడుగుపెడుతోంది టీఆర్‌ఎస్‌ పార్టీ.

టీఆర్‌ఎస్‌ అధ్యక్షులు కేసీఆర్‌ ప్రసంగం ప్రారంభం.

► టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు గౌరవ స్వాగతోపన్యాసంతో టీఆర్‌ఎస్‌ ప్లీనరీ సమావేశాలు ప్రారంభం.  

హెచ్‌ఐసీసీకి చేరిన సీఎం కేసీఆర్‌. టీఆర్‌ఎస్‌ జెండా ఆవిష్కరణ.. వేదికపైకి చేరిక.

ప్రగతి భవన్ నుంచి ప్లీనరీ ప్రాంగణానికి  బయలుదేరిన టీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు.

టీఆర్‌ఎస్‌ ఆవిర్భావ వేడుకలతో పార్టీ శ్రేణుల్లో పండుగ వాతావరణం నెలకొంది. హైదరాబాద్‌లో జరిగే ప్లీనరీ సమావేశానికి రాష్ట్రవ్యాప్తంగా సుమారు 3 వేల మంది TRS ప్రతినిధులు హాజరుకానున్నారు.

► ఒకప్పుడు బెంగాల్‌లో ఏది జరిగితే.. దేశమంతా అదే జరిగేదని చెప్పేవాళ్లు. ఇప్పుడు తెలంగాణలో ఏది జరిగితే.. దేశమంతా అదే జరుగుతోంది. తెలంగాణలో ఒకప్పుడు కరువు, వలసలు ఉండేవి. ఇప్పుడు దేశానికే ఆదర్శంగా నిలిచింది: మంత్రి హరీష్‌రావు

► టీఆర్‌ఎస్‌లో జాతీయ రాజకీయ వ్యవహారాల కమిటీ ఏర్పాటు. కమిటీ అధ్యక్షురాలిగా కల్వకుంట్ల కవిత నియామకం. 

► తెలంగాణ భవన్‌లో ఘనంగా టీఆర్‌ఎస్‌ ఆవిర్భావ వేడుకలు. జెండా ఆవిష్కరించిన వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారక రామారావు. ప్లీనరీ సమావేశంలో జాతీయ రాజకీయాలపై తీర్మానం ప్రవేశపెట్టనున్న కేటీఆర్‌.

► హైదరాబాద్‌ మాదాపూర్‌ ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ (హెచ్‌ఐసీసీ) వేదికగా బుధవారం జరగనున్న వేడుకల్లో.. పలు తీర్మానాలను ప్రవేశపెట్టనున్నారు.

► తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ 21వ ఆవిర్భావ దినోత్సవం నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. జాతీయ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషిస్తామంటూ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చేస్తున్న ప్రకటనల నేపథ్యంలో.. జాతీయ రాజకీయాలే ప్రధాన ఎజెండాగా ప్లీనరీ కొనసాగనుంది. 

మరిన్ని వార్తలు