ఈటలపై సస్పెన్షన్‌ వేటు?

8 Sep, 2022 02:19 IST|Sakshi

స్పీకర్‌ మరమనిషి అంటూ చేసిన వ్యాఖ్యలపై టీఆర్‌ఎస్‌ సీరియస్‌

బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్‌

నిబంధనల మేరకు సస్పెన్షన్‌కు ఉన్న అవకాశాల పరిశీలన

ఎథిక్స్‌ కమిటీ ముందుకు వెళ్లే అవకాశం

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర శాసనసభ సమా వేశాల సందర్భంగా స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షతన మంగళవారం జరిగిన బిజినెస్‌ అడ్వైజరీ కమిటీ సమావే శానికి బీజేపీకి ఆహ్వానం లేకపోవడం క్రమంగా రాజకీయ వేడిని పెంచుతోంది. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ స్పీకర్‌ మరమ నిషి అంటూ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఈ వ్యాఖ్యలను ఖండించడంతో పాటు ఈటల బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేసిన విష యం తెలిసిందే. ఈటల క్షమాపణ చెప్పకుంటే నిబంధనల మేరకు వ్యవహరిస్తామని వేముల ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈట లను అసెంబ్లీ నిబంధనలను అనుసరించి సస్పెండ్‌ చేసేందుకు ఉన్న అవకాశాల పరిశీ లన జరుగుతున్నట్లు తెలిసింది. మంగళవా రం వాయిదా పడిన వానాకాల సమావేశాలు తిరిగి వచ్చే సోమవారం ప్రారంభం కానుండగా, ఈటల చేసిన వ్యాఖ్యలు ఆరోజు సభలో ప్రస్తావనకు వచ్చే అవకాశముంది. 

ఈటలపై చర్యలకు డిమాండ్‌ చేసే చాన్స్‌
‘కేసీఆర్‌ చెప్తే చేసే మర మనిషిలా కాకుండా గతంలో ఉన్న సభా సంప్రదాయాలను స్పీకర్‌ కొనసాగించాలి’ అంటూ చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని టీఆర్‌ఎస్‌ డిమాండ్‌ చేస్తోంది. అయితే బుధవారం మీడియాతో మాట్లాడిన ఈటల.. స్పీకర్‌ తమ హక్కులు కాపాడాలని కోరారు. మరమనిషి అనే పదం నిషిద్ధమైనది ఏమీ కాదని ఎమ్మెల్యే రఘునందన్‌రావు, స్పీకర్‌ పదవికి కళంకం తెస్తున్న పోచారం శ్రీనివాస్‌రెడ్డిపై చర్యలు తీసుకోవా లని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్‌ వేర్వేరు చోట్ల వ్యాఖ్యానించారు. బీజేపీ వైఖరి నేప థ్యంలో ఈటలపై అసెంబ్లీ వేదికగా చర్యలు తీసుకోవాలని టీఆర్‌ఎస్‌ డిమాండ్‌ చేసే అవ కాశముంది. సభ, సభా కమిటీలు, సభ్యుల పరువు ప్రతిష్టలకు భంగం కలిగించకుండా అనుసరించాల్సిన సభా సంప్రదాయాలను టీఆర్‌ఎస్‌ ఉటంకిస్తోంది. సభ గౌరవం కాపా డేందుకు పలు కమిటీలు, నియమాలు ఉన్న విషయాన్ని గుర్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈటల వ్యాఖ్యల ఎపిసోడ్‌ను స్పీకర్‌ ద్వారా అసెంబ్లీ ఎథిక్స్‌ కమిటీ ముందుకు తీసుకువెళ్లాలని టీఆర్‌ఎస్‌ భావిస్తోంది.

తీర్మానం ద్వారా ఎథిక్స్‌ కమిటీకి..
నిబంధనల ప్రకారం.. మంత్రులు సహా శాససనసభ్యులు ఎవరైనా సభ బయట అనైతికంగా ప్రవర్తించినా, మాట్లాడినా స్పీకర్‌ దృష్టికి తీసుకెళ్లవచ్చు. ఈ మేరకు ఫిర్యాదును స్పీకర్‌ ఒక తీర్మా నం ద్వారా ఎథిక్స్‌ కమిటీ (నైతిక విలు వల కమిటీ)కి అప్పగించి విచారణ జరిపి నివేదిక ఇవ్వాల్సిందిగా కోరతారు. ప్రస్తు తం ఈ నిబంధన మేరకు స్పీకర్‌ విషయమై ఈటల చేసిన వ్యాఖ్యలను సభ దృష్టికి టీఆర్‌ఎస్‌ తీసుకెళ్లే అవకాశం ఉంది. నిబంధనల మేరకు ఈటలను అవస రమైతే సభ నుంచి సస్పెండ్‌ చేసే అవకా శముంటుందని టీఆర్‌ఎస్‌ శాసనసభా పక్షం వర్గాలు వెల్లడించాయి. ఈ ఏడాది మార్చిలో జరిగిన బడ్జెట్‌ సమావేశాల్లో గవర్నర్‌ ప్రసంగం లేకపోవడంపై నిరసన తెలిపేందుకు ప్రయత్నించిన ఈటల రాజేందర్, రఘునందన్‌రావు, రాజాసింగ్‌లను సమావేశాలు ముగిసేంత వరకు సభ నుంచి సస్పెండ్‌ చేసిన సంగతి తెలిసిందే.

ఇదీ చదవండి: స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు.. ఈటల రాజేందర్‌కు నోటీసులు?

మరిన్ని వార్తలు