తెలంగాణకు కేంద్రం అన్యాయం చేస్తోంది

24 Sep, 2020 14:57 IST|Sakshi

బీజేపీపై మంత్రి హరీశ్‌రావు ఫైర్‌..

సాక్షి, సిద్ధిపేట: ‘‘టీఆర్ఎస్ చేతల పార్టీ అని, బీజేపీ మాయ మాటల పార్టీ’’ అంటూ మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రానికి వాటాగా.. హక్కుగా రావాల్సిన కోటా ఇవ్వకుండా బీజేపీ ప్రభుత్వం మాయమాటలు చెబుతుందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు కేంద్రంపై ధ్వజమెత్తారు. సిద్ధిపేట జిల్లా మండల కేంద్రమైన రాయపోల్‌లో గురువారం ఉదయం మండలంలోని 266 మంది రైతులకు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, జడ్పీ చైర్మన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మతో కలిసి పట్టాదారు పాసు పుస్తకాలను, అధిక వర్షాలకు కూలిన ఇళ్లకు నష్టపరిహారం చెక్కులను మంత్రి పంపిణీ చేశారు (చదవండి: మొదలైన రాజకీయ వేడి.. నేతలతో కేసీఆర్‌ భేటీ

అనంతరం మంత్రి మాట్లాడుతూ బీజేపీపై విమర్శలు గుప్పించారు. తెలంగాణకు హక్కుగా రూ.10 వేల కోట్లు కేంద్రం నుంచి రావాలన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల కోసం పని చేస్తోందని, బీజేపీ ప్రభుత్వం రైతులపై బాంబులు వేస్తోందంటూ ఆయన ధ్వజమెత్తారు. ఎకరానికి ఏటా పెట్టుబడి సాయం కింద రూ.10 వేలు ఇస్తున్నామన్నారు. బీజేపీ రైతు వ్యతిరేక చట్టం అమలు చేస్తోందని.. ఆ విధానాలు నచ్చక కేంద్రమంత్రి రాజీనామా చేశారని విమర్శించారు. కరోనా కష్టకాలంలో కూడా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని, రైతుల కోసమే సీఎం కేసీఆర్ కొత్త రెవెన్యూ చట్టం తెచ్చారని ఆయన అన్నారు.(చదవండి: జీతాలు ఇచ్చేదెట్లా?)

టీఆర్ఎస్ పార్టీ చేతల్లో చూపే ప్రభుత్వమని, 7 లక్షల ఆడ పిల్లల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించామని, ఆర్థిక సాయం కింద ఇప్పటి దాకా రూ.5555 కోట్లు వెచ్చించినట్లు తెలిపారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో సంక్షేమ పథకాలు ఎక్కడా ఆగలేదని పేర్కొన్నారు. సంక్రాంతికి గంగిరెద్దుల మాదిరిగా ఓట్ల కోసం వచ్చేవారెవరో.. గుర్తించాలని కోరారు. కొత్త పట్టాదారు పాసు పుస్తకాల కోసం గతంలో ఆఫీసుల చుట్టూ తిరిగి ఇబ్బందులు పడేవారని, అయినా పాసు పుస్తకాలు పొందేవారు కారని, కొత్త రెవెన్యూ చట్టం.. రైతులకు మేలు కోసం సీఎం కేసీఆర్ తెచ్చారని వివరించారు.

1బీ కోసం తహశీల్దార్ కార్యాలయం చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని, రైతుల సమయం వృథా  కాకూడదని కొత్త రెవెన్యూ చట్టం తెచ్చామని, టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వమని, ఆరేళ్లుగా రైతు శ్రేయస్సు కోసం పని చేస్తోందన్నారు. కొత్త రెవెన్యూ చట్టంలో డిజిటల్ సర్వే చేస్తానని సీఎం కేసీఆర్ చెప్పారని, ట్రాక్టర్ ర్యాలీతో కొత్త రెవెన్యూ చట్టానికి ప్రతి గ్రామంలో స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. మండలంలోని 11,317 ఖాతాలకు 10,022 ఖాతాలు క్లియరెన్స్ చేసినట్లు వాటిలో ఇప్పటికే 9,756 పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేసుకున్నామని, ఇవాళ 266 మంది రైతులకు కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు అందిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.  నాలా- ఎక్సెస్ ఎక్సేంట్ 550, కోర్టు తగదాలతో 350,  ఈకేవైసీ-344, ప్రభుత్వ ల్యాండ్ ఖాతాలో 51 ఇలా మొత్తం క్లియరెన్స్ చేయని 1295 పట్టాదారు పాసు పుస్తకాలను త్వరితగతిన క్లియరెన్స్ చేసి రైతులకు అందివ్వాలని ఆర్డీవోను మంత్రి ఆదేశించారు. కార్యక్రమంలో ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, అడిషనల్ కలెక్టర్ పద్మాకర్, ఆర్డీఓ విజయేందర్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు