TSRTC చైర్మన్‌గా బాజిరెడ్డి గోవర్ధన్‌

16 Sep, 2021 15:36 IST|Sakshi

నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక

నిజామాబాద్‌ జిల్లాలో టీఆర్‌ఎస్‌ పార్టీకి పెద్ద దిక్కు

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) చైర్మన్‌గా టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ నియమితులయ్యారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు (కేసీఆర్‌) ప్రకటించారు. ప్రస్తుతం గోవర్ధన్‌ నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే తనను చైర్మన్‌గా నియమించడంపై గోవర్ధన్‌ సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. సీఎం కేసీఆర్‌ అప్పగించిన బాధ్యతను వందకు వంద శాతం న్యాయం చేస్తానని పేర్కొన్నారు. సీఎం మార్గదర్శకత్వంలో ఆర్టీసీని కొత్త పుంతలు తొక్కిస్తానని చెప్పారు.
చదవండి: రైలు పట్టాలపై మొసలి.. ఆగిపోయిన రైళ్లు

కాగా గోవర్ధన్‌ టీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో కీలక నాయకుడిగా ఉన్నారు. గోవర్దన్‌ స్వస్థలం సిరికొండ మండలం రావుట్ల. పోలీస్‌ పటేల్‌ నుంచి ఆర్టీసీ చైర్మన్‌గా ఎన్నికవడం మామూలు విషయం కాదు. మొదటిసారి రాజకీయాల్లోకి వచ్చాక చిమన్‌పల్లి సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం సిరికొండ ఎంపీపీగా పని చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. 1999లో ఆర్మూర్‌, 2004లో బాన్సువాడ, 2014, 18లో నిజామాబాద్‌ రూరల్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.
చదవండి: జాతీయ నిరుద్యోగ దినంగా ప్రధాని మోదీ జన్మదినం

మరిన్ని వార్తలు