ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటాం

8 Dec, 2021 00:57 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రం తీరుపై ఇక ప్రజా క్షేత్రంలోనే తేల్చుకోవాలని టీఆర్‌ఎస్‌ నిర్ణయించింది. ప్రస్తుత పార్లమెంటు సమావేశాలను పూర్తిగా బహిష్కరిస్తున్నట్టు తెలిపింది. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన కోరుతూ శీతాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి ఆందోళనలు కొనసాగిస్తున్న టీఆర్‌ఎస్‌ పార్టీ, కేంద్రం నుంచి ఎలాంటి స్పం దన లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఇకపై కేంద్రంతో పోరుబాటులోనే నడవాలని, ‘హమారా నారా(నినాదం).. మోదీ సర్కార్‌ జానా’ నినాదంతో ఉద్యమించాలని నిర్ణయిం చింది. మోదీ ప్రభుత్వం ప్రజా వ్యతి రేక విధానాలను ప్రజల్లోనే ఎండగడతామంటూ ఎంపీలంతా హైదరాబాద్‌ తిరిగి వెళ్లారు.

నల్లచొక్కాలతో నిరసన
మంగళవారం ఉభయ సభల ప్రారంభానికి ముందే దేశంలో సమగ్ర జాతీయ ధాన్యం సేకరణ విధానం తేవాలని, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని కోరుతూ.. లోక్‌సభ, రాజ్యసభల్లో టీఆర్‌ఎస్‌ పక్ష నేతలు నామా నాగేశ్వరరావు, కె.కేశవరావు వాయిదా తీర్మానాలు ఇచ్చారు. తర్వాత పార్టీ ఎంపీలంతా నల్ల చొక్కాలు ధరించి సభలు ప్రారంభమైన వెంటనే నిరసనలకు దిగారు. లోక్‌సభలో నామాతో పాటు బీబీ పాటిల్, కవిత, రంజిత్‌రెడ్డి, పసునూరి దయాకర్, రాములు, ఎంఎస్‌ఎన్‌ రెడ్డి, నేతకాని వెంకటేశ్‌లు గట్టిగా నినాదాలు చేస్తూ స్పీకర్‌ పోడియంలోకి దూసుకెళ్లారు. రబీ ధాన్యం సేకరణపై స్పష్టమైన ప్రకటన చేయాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. రాష్ట్ర రైతులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. అయినా కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో సభ నుంచి వాకౌట్‌ చేశారు. రాజ్యసభలోనూ కేకేతో పాటు కేఆర్‌ సురేశ్‌రెడ్డి, లింగయ్యయాదవ్, కెప్టెన్‌ లక్ష్మీకాంతరావు నిరసనలు తెలిపి సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. 

మా నిరసనలకు విలువ లేదు: కేకే 
‘ధాన్యం సేకరణపై ఎన్నివిధాలా నిరసనలు తెలపాలో, ఎన్ని విధాలుగా పోరాడాలో అంతా చేశాం. ఎంతచేసినా గోడకు తలబాదుకున్నట్లుగా ఉంది తప్ప స్పందించే వారే లేరు. ఇది ఫాసిస్టు ప్రభుత్వం. పార్లమెంట్‌లో ఈ అంశం తేలదని భావించి సమావేశాలను బహిష్కరిస్తున్నాం. రైతు వ్యతిరేక ప్రభుత్వంపై ప్రజల్లోకి వెళతాం. గత్యంతరం లేని పరిస్థితుల్లోనే ఈ నిర్ణయం తీసుకున్నాం. రాజీనామాలు చేసే విషయం ఆలోచిస్తాం..’అని కేకే మీడియాతో చెప్పారు.

దున్నపోతుపై వానబడ్డ చందం: నామా
‘ధాన్యంపై ప్రకటన కోరుతుంటే దున్నపోతుపై వానపడ్డ చందంగా కేంద్రం వ్యవహరిస్తోంది. కొంటామో? లేదో? చెప్పకుండా డొంక తిరుగుడు సమాధానాలు చెబుతున్నారు. తెలంగాణ ప్రభుత్వాన్ని, రైతులను ఇబ్బంది పెడుతున్నారు. ఇకపై ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటాం..’అని నామా అన్నారు.  

చట్టబద్ధత కల్పించాలని కోరుతూ.. లోక్‌సభ, రాజ్యసభల్లో టీఆర్‌ఎస్‌ పక్ష నేతలు నామా నాగేశ్వరరావు, కె.కేశవరావు వాయిదా తీర్మానాలు ఇచ్చారు. తర్వాత పార్టీ ఎంపీలంతా నల్ల చొక్కాలు ధరించి సభలు ప్రారంభమైన వెంటనే నిరసనలకు దిగారు. లోక్‌సభలో నామాతో పాటు బీబీ పాటిల్, కవిత, రంజిత్‌రెడ్డి, పసునూరి దయాకర్, రాములు, ఎంఎస్‌ఎన్‌ రెడ్డి, నేతకాని వెంకటేశ్‌లు గట్టిగా నినాదాలు చేస్తూ స్పీకర్‌ పోడియంలోకి దూసుకెళ్లారు. రబీ ధాన్యం సేకరణపై స్పష్టమైన ప్రకటన చేయాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. రాష్ట్ర రైతులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. అయినా కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో సభ నుంచి వాకౌట్‌ చేశారు. రాజ్యసభలోనూ కేకేతో పాటు కేఆర్‌ సురేశ్‌రెడ్డి, లింగయ్యయాదవ్, కెప్టెన్‌ లక్ష్మీకాంతరావు నిరసనలు తెలిపి సభ నుంచి బయటకు వెళ్లిపోయారు.

మరిన్ని వార్తలు