27న పార్టీ జెండా ఆవిష్కరించండి

18 Apr, 2022 04:51 IST|Sakshi
సభ ఏర్పాట్లను పరిశీలిస్తున్న కేటీఆర్, మాగంటి

టీఆర్‌ఎస్‌ ఆవిర్భావ దినోత్సవ సభకు 3 వేల మంది ప్రతినిధులు 

హెచ్‌ఐసీసీలో ఏర్పాట్ల పరిశీలన

టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ వెల్లడి

సాక్షి,మాదాపూర్‌: టీఆర్‌ఎస్‌ 21వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని హెచ్‌ఐసీసీలో ప్రతినిధుల సభను నిర్వహించాలని పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌ నిర్ణయించారని వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తెలిపారు. మాదాపూర్‌లోని హెచ్‌ఐసీసీలో సమావేశ మందిరం, డైనింగ్, పార్కింగ్‌ వసతులను ఆదివారం ఆయన పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... ఏప్రిల్‌ 27న జరగనున్న ప్రతినిధుల సభకు మూడు వేల మంది హాజరవుతారని తెలిపారు. సభకు వచ్చేవారికి పాస్‌లు జారీ చేస్తామని, ఆహా్వనం అందినవారే రావాలని స్పష్టం చేశారు.

మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్రస్థాయి కార్పొరేషన్ల అధ్యక్షులు, జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్స్, మేయర్లు, మున్సిపల్‌ చైర్‌పర్సన్స్, జిల్లా సహకార బ్యాంకులు, డీసీఎంఎస్‌ల అధ్యక్షులు, గ్రంథాలయ సంస్థల చైర్‌పర్సన్స్, మహిళా కోఆర్డినేటర్లు, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ అధ్యక్షులు, మండల పార్టీ అధ్యక్షులకు ఆహ్వానాలు పంపుతున్నామన్నారు. మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ప్రత్యేక ఆహా్వనితులని తెలిపారు. ఆవిర్భావ సమావేశంలో రాజకీయ తీర్మానాలు ఉంటాయని, 12,769గ్రామ శాఖల అధ్యక్షులు, 3,618పట్టణ అధ్యక్షులు స్థానికంగా జెండా ఆవిష్కరించాలని సూచించారు. కేటీఆర్‌ వెంట పార్టీ నగర అధ్యక్షులు మాగంటి గోపీనాథ్, ఎమ్మెల్సీ నవీన్‌రావు, టీఎస్‌ఐఐసీ చైర్మన్‌ బాలమల్లు తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు