ఫీజు చెల్లించలేదని ఆన్‌లైన్‌ క్లాసులు ఎలా ఆపుతారు?: హైకోర్టు

6 Jul, 2021 17:34 IST|Sakshi

ఫీజులతో ముడిపెట్టకుండా ఆన్‌లైన్‌ బోధన కొనసాగించండి

పబ్లిక్‌ స్కూల్‌ యాక్టివ్‌ పేరెంట్స్‌ ఫోరం అప్పీల్‌పై విచారణ

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా అధిక ఫీజలు వసూలు చేస్తున్నారంటూ హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌పై పబ్లిక్‌ స్కూల్‌ యాక్టివ్‌ పేరెంట్స్‌ ఫోరం చేసిన అప్పీల్‌పై తెలంగాణ హైకోర్టు మంగళవారం విచారణచేపట్టింది. ప్రభుత్వ ఉత్తర్వులకు విరుద్ధంగా ఫీజులు వసూలు చేస్తున్నారని పిటిషన్‌దారు కోర్టుకు తెలిపారు. ఫీజులు చెల్లించని 219 మందికి ఆన్‌లైన్‌ తరగతులు బోధించడం లేదన్నారు. పిటిషనర్‌ వాదనలకు బదులిస్తూ.. 10 శాతం ఫీజు పెంపును వెనక్కి తీసుకోవడంతోపాటు.. ఇప్పటికే 10వేల రూపాయల ఫీజు తగ్గించామని హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌ కోర్టుకు తెలిపింది.

ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు ఫీజు చెల్లించలేదని ఆన్‌లైన్‌ తరగతులు ఎలా ఆపుతారని హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌ యాజమాన్యాన్ని ప్రశ్నించింది. అలా ఆపితే పిల్లల చదువుకునే హక్కును కాలరాయడమేనని హైకోర్టు స్పష్టం చేసింది. కరోనా విపత్తు వేళ మానవీయంగా వ్యవహరించాలని కోర్టు సూచించింది. ఫీజుల విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. ఫీజులతో ముడి పెట్టకుండా ఆన్‌లైన్‌ బోధన కొనసాగించాలన్న హైకోర్టు.. తదుపరి విచారణ జూలై 13కి వాయిదా వేసింది.

>
మరిన్ని వార్తలు