రాయలసీమ ఎత్తిపోతల పథకంపై జోక్యం చేసుకోలేం

1 Sep, 2020 14:52 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సుప్రీంకోర్టు, జాతీయ హరిత న్యాయస్థానం‌(ఎన్జీటీ)లో పెండింగ్‌లో ఉన్న రాయలసీమ ఎత్తిపోతల పథకం పిటిషన్‌పై‌ తాము జోక్యం చేసుకోలేమని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. కాంగ్రెస్ నేత వంశీచందర్‌రెడ్డి, సామాజిక కార్యకర్త శ్రీనివాస్ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. తెలంగాణ హైకోర్టుకు విచారణ పరిధి ఉంటుందని అడిషనల్ అడ్వొకేట్ జనరల్ రామచంద్రరావు తెలిపారు. సుప్రీంకోర్టులో నదీ జలాల కేటాయింపు అంశం ఉందని ఏజీ తెలియజేశారు. అనుమతులు లేకుండా ఏపీ ప్రాజెక్టు పనులు చేపడుతోందని తెలిపారు. అయితే ఏపీ ప్రభుత్వాన్ని తెలంగాణ హైకోర్టు ఎలా ఆదేశించగలదని హైకోర్టు ప్రశ్నించింది. డీపీఆర్ సమర్పించి, టెండర్లకు వెళ్లేందుకు ఏపీకి ఎన్జీటీ అనుమతిచిందని పిటిషనర్ న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఎన్జీటీ ఉత్తర్వులపై అభ్యంతరం ఉంటే సుప్రీం కోర్టుకు ఎందుకు వెళ్లలేదని హైకోర్టు ప్రశ్నించింది.(తీర్పును రిజ‌ర్వ్‌లో పెట్టిన ఎన్జీటీ)

ఎన్జీటీకి విచారణ పరిధి లేదని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. విచారణ పరిధిపై ముందు ఎన్జీటీ తేల్చాలని హైకోర్టు పేర్కొంది. పిటిషన్‌లోని అన్ని అంశాలు సుప్రీంకోర్టు ముందు ఉన్నాయని ఆంధ్రప్రదేశ్‌ ఏజీ శ్రీరాం తెలిపారు. సుప్రీంకోర్టు విచారణ పూర్తయ్యే వరకు ఆగాలని ఏపీ ఏజీ పేర్కొన్నారు. సుప్రీంకోర్టులో విచారణ పూర్తయ్యే వరకు నిరవధిక వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు తెలిపింది. సుప్రీంకోర్టులో తేలిన తర్వాత తమ దృష్టికి తీసుకురావచ్చునని పిటిషనర్లకు తెలంగాణ హైకోర్టు సూచించింది.

మరిన్ని వార్తలు