తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురు

20 Jan, 2021 13:35 IST|Sakshi

ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్‌లపై స్టే కొనసాగిస్తూ నిర్ణయం

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. బీఆర్ఎస్‌లపై స్టే యథావిధిగా కొనసాగించాలని ధర్మాసనం నిర్ణయించింది. ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్‌లపై బుధవారం హైకోర్టు విచారించింది. ఇదే అంశంపై సుప్రీంకోర్టులో పిటిషన్‌ పెండింగ్‌లో ఉండడంతో.. అక్కడ ఉత్తర్వులు వెలువడిన తర్వాతే విచారణ చేపడతామని హైకోర్టు స్పష్టం చేసింది. అయితే అప్పటివరకూ అర్జీదారులను ఎలాంటి ఇబ్బందులకు గురిచేయొద్దని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన అర్డర్‌ కాపీలను సమర్పించాలని ప్రభుత్వాన్ని న్యాయస్థానం కోరింది.

ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్‌లపై ఇప్పటికే మూడు రాష్ట్రాలను సుప్రీంకోర్టు ఇంప్లీడ్‌ చేసిన విషయం తెలిసిందే. ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్‌లపై విధివిధానాలు తెలపాలని మూడు రాష్ట్రాలకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయాన్ని హైకోర్టు పరిశీలించింది. సుప్రీంకోర్టు తుది ఆదేశాల తర్వాత ఈ పిటిషన్‌ను విచారిస్తామని హైకోర్టు తెలిపింది. అప్పటివరకు బీఆర్ఎస్‌పై స్టే యథావిధిగా కొనసాగుతుందని ప్రకటించింది. ఎల్ఆర్ఎస్‌పై సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చేంత వరకు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని ప్రభుత్వానికి చెప్పింది. ఎల్ఆర్ఎస్ మీద ప్రభుత్వం తెచ్చిన జీవోపై ఎలాంటి చర్యలు తీసుకోమని కోర్టుకు ప్రభుత్వ తరఫు న్యాయవాది (ఏజీ) సమాధానం ఇచ్చారు. ఏజీ చెప్పిన స్టేట్మెంట్‌ను హైకోర్టు నమోదు చేసుకుంది.

మరిన్ని వార్తలు