దేవుడికి ప్రార్థన ఎక్కడైనా చేసుకోవచ్చు: హైకోర్టు

9 Sep, 2020 14:53 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గుడిలోనే దేవుడికి ప్రార్థనలు చేసుకోవాలని ఎక్కడ లేదని, మనసులో దేవుడు ఉంటే ఎక్కడైనా ప్రార్థన చేసుకోవచ్చని తెలంగాణ హైకోర్టు తెలిపింది. సచివాలయంలోని మసీదు కూల్చివేతపై సయ్యద్ యాసన్, మహమ్మద్ ముజాఫరుల్ల, ఖాజా అజ్జాజుదీన్ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. సచివాలయంలో ఉన్న భూమి వక్ఫ్‌ బోర్డుకు చెందిన భూమి అని పిటిషనర్ల తరఫు న్యాయవాది పేర్కొన్నారు. కూల్చివేయడం చట్ట విరుద్ధమని పిటిషనర్లు హైకోర్టుకు తెలిపారు. 657 గజాలు ఉన్న మసీదును కూల్చివేసి 1500 చదరపు అడుగులు స్థలం కేటాయించడంపై పిటిషనర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. సచివాలయం కూల్చివేతలో భాగంగా మసీదు కూడా కూలిపోయిందని ఏజీ హైకోర్టుకు తెలియజేశారు.

ప్రభుత్వ ఖర్చుతో నూతన మసీదును నిర్మిస్తామని చెప్పారు. మసీదును ఎక్కడైతే కూల్చివేశారో అక్కడే నూతనంగా మసీదు నిర్మాణం చేపట్టాలని పిటీషనర్లు కోరారు. గుడిలోనే దేవుడికి ప్రార్థనలు చేసుకోవాలని ఎక్కడ లేదని మనసులో దేవుడు ఉంటే ఎక్కడైనా ప్రార్థన చేసుకోవచ్చని హైకోర్టు పేర్కొంది.  దేవుళ్లు, మతాల కంటే చట్టాలు గొప్పవని తెలిపింది. ప్రజా అవసరాల కోసం మసీదులని కుల్చే అధికారం ప్రభుత్వానికి ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. చట్ట ప్రకారం ప్రభుత్వాలు ఆ పని చేయవని తెలిపింది. అవసరమైతే కూల్చిన ప్రదేశానికి సంబందించి నష్ట పరిహారం చెల్లించాలని హైకోర్టు స్పష్టం చేసింది. మసీదు కూల్చితపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని  హైకోర్టు ఆదేశించింది. ఇక తదుపరి విచారణ అక్టోబర్ 8కి వాయిదా వేసింది.  

మరిన్ని వార్తలు