పేదరికం బీసీలకు పెద్ద శాపం

11 Jan, 2023 02:49 IST|Sakshi

హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ నంద

అమీర్‌పేట: పేదరికం బీసీలకు పెద్ద శాపమని, బీసీల్లో చాలా మంది చదువుకోలేక పోతున్నా­రని హైకోర్టు న్యాయ­మూర్తి జస్టిస్‌  సూరెపల్లి నంద ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ సమాజ్‌ ఆధ్వర్యంలో అమీర్‌పేటలో మంగళవారం నిర్వహించిన  ‘బీసీ ఉమెన్‌ సింపోజియం’లో జస్టిస్‌ నంద మాట్లాడా­రు. పనిలో ఇచ్చే వేతనం మహిళలకు తక్కువగా ఉంటుందని,  ఉద్యోగాలు, ప్రమోషన్లలో సైతం వివక్ష చూపిస్తున్నారని అన్నారు.

మహిళలకు చదువు చెప్పిస్తే సమాజం అభివృద్ధి చెందుతుందని..  ఇంట్లో అమ్మ చదువుకుంటే అందరూ చదువుకు­న్నట్లేనని పేర్కొన్నారు. విద్య అన్నిటికంటే ముఖ్యం కాగా రెండో ముఖ్యమైన రంగం రాజకీ­య­మన్నారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌ రాజకీయ సాధికారతకు నిదర్శనమన్నారు.

కూతురే కావాలంటున్నారు: ఈటల  
కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ .. ఇప్పుడు ట్రెండ్‌ మా­రింది. అబ్బాయి వద్దు.. అమ్మాయి కావాలని చా­లా మంది తల్లిదండ్రు­లు కోరుకుంటున్నారని చె­ప్పా­­రు. ఏ తల్లి కుటుంబాన్ని పట్టించుకుంటుందో ఆ కుటుంబమే బాగు­పడుతుందన్నారు. దేశంలో వ్యవసాయం ఇంకా ఉందంటే అది మహి­ళల శ్రమవల్లేనని అ­న్నా­రు. జ్ఞానం, సంస్కారం కులాన్ని బట్టి రావనీ, చైతన్యానికి, ఐక్యత­కు, పోరాటానికి కులం లేదని చెప్పారు. కార్యక్ర­మంలో రెండు రాష్ట్రాలకు చెందిన  మహిళలు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు