కరోనా హెల్త్‌ బులిటెన్‌ : హైకోర్టు కీలక ఆదేశాలు

28 Jul, 2020 15:18 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణలో కరోనా పరీక్షలు, బాధితులకు అందిస్తున్న ఏర్పాట్లపై హైకోర్టులో వాడీవేడి వాదనలు జరిగాయి. పరీక్షల విషయంలో ఇప్పటికే పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయస్థానం.. ఈసారి స్వయంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కుమార్‌ని కోర్టు ముందు నిలబెట్టింది. ఆయన ద్వారా అన్ని వివరాలను అడిగి తెలుసుకుంది. మంగళవారం విచారణ సందర్భంగా ప్రభుత్వానికి పలు సూచనలు, సలహాలు ఇచ్చింది. కరోనాపై జారీ చేసే హెల్త్‌ బులిటిన్‌ను తప్పులు లేకుండా ప్రతి రోజు ప్రింట్‌, ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రసారం చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే ఐసీఎంఆర్‌, ప్రపంచ ఆరోగ్య సంస్థ జారీచేసిన మార్గదర్శకాలను తూచా తప్పకుండా పాటించాలని తెలిపింది. పేద వాళ్ళ కోసం ఫంక్షన్ హాల్స్, కమ్యూనిటీ సెంటర్స్, వెల్ఫైర్ అసోసియేషన్ సెంటర్స్‌ను వాడుకోవాలని ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. గతంలో ప్రభుత్వంపై వచ్చిన ఫిర్యాదులపై తాము ఇచ్చిన ఆదేశాలను ఏ విధంగా పాటిస్తున్నారో కౌంటర్‌ దాఖలు చేయాలని సీఎస్‌ను ధర్మాసనం ఆదేశించింది. (ర్యాపిడ్‌ కిట్ల వాడకంపై హైకోర్టులో విచారణ)

తప్పనిసరిగా అమలు చేస్తాం..
మరోవైపు విచారణ సందర్భంగా కరోనా నివారణకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలను వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సీఎస్‌ సోమేష్‌ కుమార్‌ హైకోర్టుకు నివేదించారు. కరోనా బాధితులు పెరుగుతున్న దృష్ట్యా 857 హోటల్స్ గదుల్లో ఐసోలేషన్ సెంటర్లను ఏర్పాటు చేశామని తెలిపారు. ‘కోవిడ్ బారిన పడిన 248 మంది ప్రస్తుతం ఆ హోటల్ గదుల్లో ఉన్నారు. కోవిడ్ బాధితులను ఆస్పత్రుల్లో చేర్చుకునే పద్ధతిని మరింత సులభతరం చేస్తాం. గతంలో హైకోర్టు ఇచ్చిన అన్ని ఆదేశాలను తప్పని సరి అమలు చేసి,. రిపోర్టు సమర్పిస్తాం. ప్రస్తుతం రాష్ట్రంలో 2 లక్షల రాపిడ్ కిట్లు వాడకంలో ఉన్నాయి. భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని మరో 4 లక్షల కిట్లు ఆర్డర్ చేశాం

ఎమ్‌ఆర్‌ఐ, సిటీ స్కాన్‌లపై ప్రైవేట్ హాస్పిటల్‌లో ఛార్జ్‌ల విషయంపై వారితో చర్చిస్తున్నాం. వాటిపై ఇప్పటి వరకు 726 ఫిర్యాదు అందాయి.  వారికి ఇప్పటికే నోటీసులు ఇచ్చి విచారణ కోరుతున్నాం.  ప్రతి రోజు కరోనా పై పూర్తి సమాచారాన్ని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు తప్పనిసరిగా అందిస్తాం. ప్రతి హాస్పిటల్స్ వద్ద డిస్‌ప్టే బోర్డ్లను ఏర్పాటు చేస్తాం. రాష్ట్రంలో ఎక్కువగా 21-50 ఏళ్ల వయస్సు గల వారే కరోనా బారిన పడుతున్నారు. దీనిని నివరించడానికి అన్ని చర్యలు చేపడుతున్నాం. అని సీఎస్‌ కోర్టుకు వెల్లడించారు. ప్రభుత్వ వాదనలు విన్న న్యాయస్థానం.. రాపిడ్ కిట్ల వాడకం మరోసారి నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని సూచించింది. తదుపరి విచారణ ఆగస్ట్ 13కు వాయిదా వేసింది.

మరిన్ని వార్తలు