హైదరాబాద్: ఒప్పంద డిగ్రీ, జూనియర్ అధ్యాపకులను క్రమబద్ధీకరించవద్దన్న పిటిషన్ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. క్రమబద్ధీకరించకుండా ప్రత్యక్ష నియామకాలు చేపట్టాలని 2016లో దాఖలైన పిటిషన్పై ధర్మాసనం బుధవారం విచారించింది. ప్రభుత్వం ఒప్పంద అధ్యాపకుల సర్వీసు క్రమబద్ధీకరించిందా అని ఈ సందర్భంగా పిటీషనర్లను న్యాయస్థానం ప్రశ్నించింది. అయితే క్రమబద్ధీకరణకు ప్రతిపాదనలు రూపొందించిందని పిటిషనర్ల తరఫు న్యాయవాది తెలిపారు.
దీంతో పిటిషన్ దాఖలు చేసిన 24 మంది నిరుద్యోగులపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రమబద్ధీకరిస్తున్నారని ఊహించుకొని పిటిషన్ ఎలా వేస్తారని అసహనం వ్యక్తం చేసింది. పిటిషనర్లు ఒక్కొక్కరు రూ.10 వేలు జరిమానా చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో ఆ పిటిషన్ను న్యాయస్థానం కొట్టివేసింది. ఈ చర్యతో పిటిషన్దారులు అవాక్కయ్యారు.