తెలంగాణ: మొదటిసారి 100 శాతం పాస్‌  

29 Jun, 2021 07:52 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

176722మందికి ఏ –గ్రేడ్‌

ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరంలో 4,73,850 మంది ఉతీర్ణత 

సాక్షి, హైదరాబాద్‌: ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరంలో 4,73,850 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. వారందరికి ప్రథమ సంవత్సరంలో వచ్చిన మార్కుల ఆధారంగా ద్వితీయ సంవత్సరంలో మార్కులను ఇంటర్మీడియట్‌ బోర్డు కేటాయించింది. ఈ ఫలితాలను తెలంగాణ విద్యా మంత్రి సబితా ఇంద్రారెడ్డి సోమవారం విడుదల చేశారు. పరీక్ష ఫీజు చెల్లించిన వారిలో రెగ్యులర్‌ విద్యార్థులు 4,51,585 మంది ఉన్నట్లు మంత్రి పేర్కొన్నారు. విద్యార్థుల ఫలితాలను బోర్డు వెబ్‌సైట్‌ (https:// tsbie. cgg. gov. in,  http:// examresults.ts nic. in, http:// results. cgg. gov. in) లో ఉంచినట్లు తెలిపారు. విద్యార్థులు తమ ప్రథమ సంవత్సర హాల్‌ టికెట్‌ నంబర్‌ను పొందుపరిచి ద్వితీయ సంవత్సర ఫలితాలను పొందవచ్చని, గతంలో ఫెయిల్‌ అయిన విద్యార్థులు తమ పాత హాల్‌ టికెట్‌ నంబర్‌ ద్వారా మార్కులు పొందవచ్చని మంత్రి వివరించారు. ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం ఉత్తీర్ణులైన మొత్తం రెగ్యులర్‌ విద్యార్థుల్లో 1,76,722 మంది ఏ గ్రేడ్‌ వారున్నారు. బీ గ్రేడ్‌లో 1,04,891 మంది, సీ గ్రేడ్‌లో 61,889 మంది, డి గ్రేడ్‌లో 1,08,083 మంది విద్యార్థులు ఉత్తీర్ణులైనట్లు వెల్లడించారు. 

ప్రాక్టికల్స్‌లో 100 శాతం... 
కరోనా కారణంగా ఈసారి వార్షిక పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసింది. విద్యార్థులకు ప్రథమ సంవత్సరంలో వచ్చిన మార్కులనే ద్వితీయ సంవత్సరంలో ఆయా సబ్జెక్టులకు కేటాయించింది. ప్రథమ సంవత్సరంలో విద్యార్థులు ఏవైనా సబ్జెక్టుల్లో ఫెయిల్‌ అయి ఉంటే.. వాటికి 35 శాతం పాస్‌ మార్కులను కేటాయించింది. ద్వితీయ సంవత్సరంలోనూ ఆ సబ్జెక్టుల్లో అవే మార్కులను కేటాయించింది. అలాంటి విద్యార్థులు 1,99,019 మంది ఉన్నారు. వారందరికి ఆయా సబ్జెక్టుల్లో 35 శాతం చొప్పున మార్కులను కేటాయించి పాస్‌ చేసింది. ఈసారి ప్రాక్టికల్స్‌ కూడా నిర్వహించని కారణంగా విద్యార్థులందరికి అందులో 100 శాతం మార్కులను కేటాయించింది. ఎథిక్స్‌ అండ్‌ హ్యూమన్‌ వ్యాల్యూస్, ఎన్విరాన్‌మెంటల్‌ ఎడ్యుకేషన్‌ సబ్జెక్టుల్లో ఫెయిల్‌ అయిన వారికి 35 శాతం పాస్‌ మార్కులను ఇచ్చింది. ప్రథమ సంవత్సరంలో ఫెయిల్‌ అయిన వొకేషనల్‌ బ్రిడ్జికోర్సు, అదనపు సబ్జెక్టుల్లో 35 శాతం పాస్‌ మార్కులు వేసింది. ప్రస్తుతం కేటాయించిన మార్కులతో ఎవరైనా విద్యార్థులు సంతృప్తి చెందకపోతే సాధారణ పరిస్థితులు ఏర్పడ్డాక రాత పరీక్షలకు హాజరుకావచ్చని పేర్కొంది. 

జూలై 1 నుంచి మార్కుల మెమోలు... 
మార్కుల మెమోలను (కలర్‌ షార్ట్‌ మెమో) విద్యా ర్థులు బోర్డు వెబ్‌సైట్‌ ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకునేలా ఇంటర్‌ బోర్డు చర్యలు చేపట్టింది. జూలై 1వ 
తేదీ మధ్యాహ్నం 2 గంటల తరువాత http://tsbie.cgg.gov.in వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. విద్యార్థుల పాస్‌ మెమోల్లో ఏమైనా తప్పులు దొర్లితే 040–24600110 ఫోన్‌ నంబర్‌లో ఉదయం  9.30  గంటల  నుంచి  సాయంత్రం 5.30 గంటల వరకు ఫిర్యాదు చేయవచ్చు. లేదంటే ఆన్‌లైన్‌లోనూ  (www. bigrs. telangana. gov. in), బీఐజీఆర్‌ఎస్‌ యాప్‌ ద్వారా కూడా ఫిర్యాదు చేసేలా బోర్డు ఏర్పాట్లు చేసింది. కాలేజీల వారీగా ఫలితాలను కాలేజీ యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ ఉపయోగించి పొందవచ్చు. కాలేజీల వారీగా మార్కుల రిజిస్టర్లను జూలై 5 నుంచి కాలేజీ లాగిన్‌ ద్వారా పొందవచ్చు. 

మొదటిసారి 100 శాతం పాస్‌.. 
కరోనా కారణంగా ఈసారి పరీక్షలు లేనందున విద్యార్థులంతా పాస్‌ అయ్యారు. ఈసారి 4,73,850 మంది విద్యార్థులు ఉత్తీర్ణులు కాగా, గతేడాది 4,85,166 మంది (62.23 శాతం) ఉత్తీర్ణులయ్యారు. 2018–19 విద్యా సంవత్సరంలో 4,90,308 (59.37%), 2017–18లో 5,07,906 మంది (60.97%), 2016–17లో 5,01,119 మంది (59.91%) విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. 

పాసైన విద్యార్థుల వివరాలివే.. 
స్ట్రీమ్‌        విద్యార్థులు    రెగ్యులర్‌  
జనరల్‌    4,28,921     4,07,684 
వొకేషనల్‌    44,929        43,901 
మొత్తం    4,73,850    4,51,585 

పాసైన వారిలో బాలురు-2,36,409 
బాలికలు-2,37,441 

ప్రధాన గ్రూపుల వారీగా 
విద్యార్థుల వివరాలు.. 

గ్రూపు    విద్యార్థులు 
ఎంపీసీ     1,74,945 
ఎంఈసీ    20,716 
బైపీసీ    1,00,547 
సీఈసీ    1,18,750 
హెచ్‌ఈసీ    12,954 

మరిన్ని వార్తలు