TS Inter Supply Results 2022: ఇంటర్‌ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

30 Aug, 2022 11:08 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఇంటర్మీడియెట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. బోర్డు కమిషనర్ సయ్యద్ ఒమర్ జలీల్ మంగళవారం ఉదయం విడుదల చేశారు. విద్యార్థులు సాక్షి ఎడ్యుకేషన్‌ వెబ్‌సైట్‌లో ఫలితాలు చెక్‌ చేసుకోవచ్చు. ఈ ఏడాది మే నెలలో ఇంటర్మీడియెట్‌ రెగ్యులర్‌ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షల్లో ఫెయిల్‌ అయిన విద్యార్థులకు ఆగస్టు 1 నుంచి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించారు. ఎంసెట్ కౌన్సిలింగ్ ఉన్నందున విద్యార్థుల తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు సప్లిమెంటరీ ఫలితాలను ముందుగానే ప్రకటించారు.

ఈ ఫలితాల్లో 48,816 మంది విద్యార్థులు పాస్‌ అయ్యారు. 47.74 ఉత్తీర్ణత శాతం నమోదైంది. మొత్తం 1,02,236 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు.  వొకేషన్‌లో 12,053 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవ్వగా.. ఇందులో 7,843 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఉత్తీర్ణత శాతం  65.07గా నమోదైంది.

అయితే, సెప్టెంబర్‌ 5 నుంచి 8 వరకు రీకౌంటింగ్‌కు ఇంటర్‌ బోర్డు అవకాశం కల్పించింది. మరో వైపు ఇవాళ సాయంత్రం ఇంటర్‌ మొదటి సంవత్సరం సప్లిమెంటరీ ఫలితాలను ప్రకటించనున్నట్లు బోర్డు పేర్కొంది.

ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు వార్షిక పరీక్షలతో సంబంధం లేకుండా ఎంసెట్‌కు హాజరవుతారు. అయితే ఇప్పటికే ఎంసెట్‌ ఫలితాలు ప్రకటించి, కౌన్సెలింగ్‌ ప్రక్రియ కూడా మొదలైంది. ఇందులో భాగంగా ధ్రువపత్రాల పరిశీలనకు విద్యార్థులు హాజరవ్వాల్సి ఉంటుంది. ఇంటర్‌ ఫెయిల్‌ అయి, సప్లిమెంటరీ పరీక్షలు రాసిన 1.13 లక్షల మంది విద్యార్థులు ఫలితాలు రాకపోవడంతో తొలిదశ ఎంసెట్‌ కౌన్సెలింగ్‌కు హాజరవ్వలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఫలితాలు విడుదల చేశారు ఇంటర్‌ బోర్డు అధికారులు.

ఫలితాల కోసం డైరెక్ట్ లింక్స్‌ ఇవే
జనరల్‌ గ్రూపుల ఫలితాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

ఒకేషనల్‌ గ్రూపుల ఫలితాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ తేదీల్లో మార్పులు..? 
ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాల కోసం నిరీక్షిస్తున్న వారికి ఉన్నత విద్యామండలి ఎంసెట్‌కు హాజరయ్యే అవకాశం కల్పించాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలిసింది. వాస్తవానికి సెప్టెంబర్‌ 6న ఇంజనీరింగ్‌ సీట్ల కేటాయింపు జరగనుంది. ఈ కారణంగా సప్లిమెంటరీ రాసిన విద్యార్థులు తొలిదశ కౌన్సెలింగ్‌కు హాజరయ్యే అవకాశం కన్పించడం లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని రిజిస్ట్రేషన్‌, ఆప్షన్ల నమోదు తేదీలను పొడిగించాలని నిర్ణయించారు. ఉన్నత విద్యామండలి అధికారులు మంగళవారం సమావేశమైన అధికారిక నిర్ణయం తీసుకునే వీలుంది.

మరిన్ని వార్తలు