టీఎస్‌ఎస్పీడీసీఎల్‌లో 1,661 పోస్టుల భర్తీ 

1 Feb, 2023 00:50 IST|Sakshi

తక్షణమే నోటిఫికేషన్‌ జారీచేయాలని మంత్రి జగదీశ్‌రెడ్డి ఆదేశం 

సాక్షి, హైదరాబాద్‌: దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ (టీఎస్‌ఎస్పీడీసీఎల్‌)లో ఖాళీగా ఉన్న 1,553 జూనియర్‌ లైన్‌మెన్‌ (జేఎల్‌ఎం), 48 అసిస్టెంట్‌ ఇంజనీర్‌ (ఎలక్ట్రికల్‌) పోస్టులు కలిపి మొత్తం 1,661 పోస్టుల భర్తీకి తక్షణమే నోటిఫికేషన్‌ జారీ చేయాలని విద్యుత్‌ శాఖ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి ఆదేశించారు. నిరంతర విద్యుత్‌ సరఫరాపై మంగళవారం ఆయన మింట్‌ కాంపౌండ్‌ లోని తన కార్యాలయంలో ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు, టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ సీఎండీ జి.రఘుమారెడ్డితో సమీక్ష నిర్వహించారు.

సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు విద్యుత్‌ డిమాండ్‌ ఎంత పెరిగినా నిరంతర విద్యుత్‌ సరఫరా చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఏడాదికేడాది విద్యుత్‌ డిమాండ్‌ పెరిగిపోతోందని, ఉమ్మడి రాష్ట్రంలో కేవలం 6,666 మెగావాట్లు ఉన్న గరిష్ట విద్యుత్‌ డిమాండ్‌ గతేడాది యాసంగిలో 14,160 మెగావాట్లకు పెరిగిందన్నారు. వచ్చే వేసవిలో  15,500 మెగావాట్లకు మించనుందని, అందుకు తగ్గట్టు సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాలని సీఎండీలను ఆదేశించారు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి, గృహ వినియోగదారుల పెరుగుదల, వ్యవ సాయ రంగానికి ఉచితవిద్యుత్‌ సరఫరాతో డిమాండ్‌ గణనీయంగా పెరిగిందన్నారు.   

మరిన్ని వార్తలు