‘దావోస్‌’ పెట్టుబడులు రూ. 21 వేల కోట్లు

22 Jan, 2023 02:47 IST|Sakshi
తన బృందంతో మంత్రి కేటీఆర్‌ 

పర్యటన విజయవంతం: కేటీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌: స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదిక సమావేశాల్లో తెలంగాణ ప్రభుత్వం రూ. 21 వేల కోట్ల మేర పెట్టుబడులను సాధించినట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారక రామారావు పేర్కొన్నారు. తనతోపాటు అధికారుల బృందం 4 రోజులపాటు అక్కడి సమావేశాల్లో పాల్గొని తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించినట్లు ఆయన ట్విట్టర్‌లో వివరించారు.

అంతర్జాతీయ, దేశీయ దిగ్గజ కంపెనీలకు చెందిన చైర్మన్లు, సీఈఓలు తదితరులతో 52 సమావేశాలు, 6 రౌండ్‌టేబుల్‌ సమావేశాల్లో పాల్గొన్నట్లు తెలిపారు. దావోస్‌లో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలంగాణ పెవిలియన్‌ను బహుళజాతి కంపెనీల ప్రతినిధులు, ఆర్థిక నిపుణులు, విధానాల రూపకర్తలు సందర్శించారు. తెలంగాణ భౌగోళిక స్వరూపం, మౌలిక వసతులు, కాళేశ్వరం ప్రాజెక్టు, ప్రభుత్వ విధానాలపై రూపొందించిన ప్రత్యేక వీడియోలను ఈ పెవిలియన్‌లో ప్రదర్శించారు.  

యువతకు భారీగా ఉద్యోగాల కోసం.. 
వరుసగా ఐదోసారి వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం సమావేశాలకు హాజరైన కేటీఆర్‌... దావోస్‌లో అడుగు పెట్టింది మొదలు వరుసగా వివిధ దిగ్గజ కంపెనీల అధినేతలతో ముఖాముఖి చర్చలు జరిపారు. దావోస్‌ పర్యటన మార్గమధ్యలో స్విట్జర్లాండ్‌లోని అతిపెద్ద నగరమైన జూరిచ్‌లో ప్రవాస భారతీయులతో ప్రత్యేకంగా కేటీఆర్‌ సమావేశమయ్యారు. తెలంగాణకు పెట్టుబడులతో రావాల్సిందిగా వారిని ఆహ్వానించారు. రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు తెచ్చి పెద్ద ఎత్తున యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న ఆలోచనే నిరంతరం తమను నడిపిస్తోందని కేటీఆర్‌ పేర్కొన్నారు. దావోస్‌ పర్యటనకు వెళ్లిన కేటీఆర్‌ బృందం శనివారం హైదరాబాద్‌కు చేరుకుంది. 

దావోస్‌లో రాష్ట్రం సాధించిన పెట్టుబడులు
►హైదరాబాద్‌లో మరో 3 డేటా సెంటర్ల ఏర్పాటు కోసం మైక్రోసాఫ్ట్‌ రూ. 16 వేల కోట్ల పెట్టుబడి ప్రకటన.  
►హైదరాబాద్‌లో హైపర్‌స్కేల్‌ డేటా సెంటర్‌ ఏర్పాటు చేసేందుకు భారతీ ఎయిర్‌టెల్‌ గ్రూప్‌ రూ. 2 వేల కోట్ల ఇన్వెస్ట్‌మెంట్‌.  
►రూ. వెయ్యి కోట్లతో హైదరాబాద్‌ కేంద్రంగా భారతీయ మార్కెట్‌లోకి ఫ్రాన్స్‌ ఔషధ పరిశోధన, తయారీ సంస్థ యూరోఫిన్స్‌ విస్తరణ ూలండన్‌ తరువాత హైదరాబాద్‌లో అపోలో టైర్స్‌ డిజిటల్‌ ఇన్నోవేషన్‌ సెంటర్‌. 
►రూ.210 కోట్ల పెట్టుబడితో అలాక్స్‌ అడ్వాన్స్‌ మెటీరియల్స్‌ మల్టీ గిగావాట్‌ లిథియం క్యాథోడ్‌ మెటీరియల్‌ తయారీ కేంద్రం 
►తెలంగాణలో పెప్సీకో కార్యకలాపాలు రెట్టింపు  
►హైదరాబాద్‌లో ప్రపంచ ఆర్థిక వేదిక నాలుగో పారిశ్రామిక విప్లవానికి సంబంధించిన కేంద్రం  
►హైదరాబాద్‌లో రూ. 150 కోట్లతో రీహాబిలిటేషన్‌ థెరపీలో రోగులు, వైద్య సంస్థలకు అవసరమయ్యే డిజిటల్‌ సేవలను అందించే వెబ్‌పీటీ ప్రపంచ సామర్థ్య కేంద్రం. 

మరిన్ని వార్తలు