సర్కారీ పాలిటెక్నిక్‌కే సై

29 Jul, 2022 01:07 IST|Sakshi

తొలివిడతలో 91% సీట్ల కేటాయింపు 

ప్రైవేటు సంస్థల్లో కేవలం 60 శాతమే 

కంప్యూటర్స్‌కే విద్యార్థులు ప్రాధాన్యం 

సాక్షి, హైదరాబాద్‌: డిప్లొమా కోర్సుల్లో చేరేందుకు విద్యార్థులు ఎక్కువగా ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీలనే ఎంచుకున్నారు. ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాలిటెక్నిక్‌ కాలేజీలు 55 ఉండగా, వీటిల్లో 91.69 శాతం సీట్లు కేటాయించారు. 63 ప్రైవేటు కాలేజీల్లో కేవలం ఐదింటికి మాత్రమే విద్యార్థులు ఆప్షన్లు ఇచ్చారు. దీంతో 60.34 శాతం మాత్రమే సీట్లు కేటాయించారు.

టెన్త్‌ తర్వాత పాలిటెక్నిక్‌ డిప్లొమా ప్రవేశాలకు సంబంధించి రాష్ట్ర టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ నిర్వహించిన పాలిసెట్‌కు 79,051 మంది అర్హత సాధించారు. తొలిదశ కౌన్సెలింగ్‌లో 25,146 మంది 5,96,613 ఆప్షన్లు ఇచ్చారు. వీటిని పరిశీలించిన పాలిసెట్‌ విభాగం గురువారం మొదటి విడత సీట్లను కేటాయించింది. 

డిప్లొమా దశలోనూ కంప్యూటర్‌ కోర్సుల వైపే..
పాలిటెక్నిక్‌లో దాదాపు 25 బ్రాంచీలున్నాయి. వీటిల్లో 28,083 సీట్లు అందుబాటులో ఉన్నాయి. తొలివిడత ఆప్షన్లకు అనుగుణంగా 20,695 (73.69 శాతం) సీట్లు కేటాయించారు. ఇందులో విద్యార్థులు అత్యధికంగా కంప్యూటర్‌ సైన్స్‌ కోర్సులకే ప్రాధాన్యం ఇచ్చారు. కంప్యూటర్స్‌లో 4,110 సీట్లు ఉండగా వందశాతం కేటాయించారు. దీనికి అనుబంధ కోర్సుగా చెప్పుకునే ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్, మెషీన్‌ లెర్నింగ్‌లో మొత్తం 178 సీట్ల(వంద శాతం)కూ విద్యార్థులు ఆప్షన్లు ఇచ్చారు.

సైబర్‌ ఫిజికల్‌ సిస్టమ్స్‌ అండ్‌ సెక్యూరిటీలో ఉన్న 59 సీట్లూ తొలి కౌన్సెలింగ్‌లోనే భర్తీ అయ్యాయి. క్లౌడ్‌ కంప్యూటింగ్‌ (100 శాతం) వైపు విద్యార్థులు ఆసక్తి చూపారు. సంప్రదాయ కోర్సులైన సివిల్‌ ఇంజనీరింగ్‌ (67.7 శాతం), మెకానికల్‌ (48.63 శాతం) మాత్రమే విద్యార్థులు ఎంచుకున్నారు.  

నెలాఖరులోగా రిపోర్టింగ్‌ 
తొలి విడత కేటాయింపులో సీటు దక్కించుకున్న అభ్యర్థులు ఈ నెలాఖ రులోగా సెల్ఫ్‌ రిపోర్టి్టంగ్‌ చేయాల్సి ఉంటుంది. tspolycet.nic.in అనే వెబ్‌సైట్‌కు లాగిన్‌ అయి, అలాట్‌మెంట్‌ ఆర్డర్‌తోపాటు అవసరమైన ధ్రువపత్రాలు అప్‌లోడ్‌ చేసి, నిర్ధారించిన ఫీజు ఆన్‌లైన్‌ ద్వారా చెల్లించవచ్చు. తుదిదశ వరకూ అభ్యర్థులు కౌన్సెలింగ్‌లో పాల్గొనే చాన్స్‌ ఉంటుంది.

మరిన్ని వార్తలు