రెండో డోస్‌ లైట్‌ తీసుకోవద్దు

21 Oct, 2021 03:27 IST|Sakshi

ప్రజారోగ్య డైరెక్టర్‌ డాక్టర్‌ శ్రీనివాసరావు హెచ్చరిక

వ్యాక్సిన్‌ తీసుకోని వారిలో 60%  మందికి వైరస్‌ సోకుతుంది 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా మొదటి డోస్‌ వ్యాక్సిన్‌ వేసుకున్న వారు రెండో డోస్‌ వేసుకోకుండా నిర్లక్ష్యం చూపొద్దని ప్రజారోగ్య డైరెక్టర్‌ డాక్టర్‌ శ్రీనివాస్‌రావు అన్నారు. రాష్ట్రంలో ఒకట్రెండు రోజుల్లో మూడు కోట్ల డోసుల వాక్సినేషన్‌ పూర్తికానుందని బుధవారం పేర్కొన్నారు. రాష్ట్రంలో 75 శాతం మందికి మొదటి డోస్, 39 శాతం మందికి రెండో డోస్‌ పూర్తయిందన్నారు. ఇంకా 37 శాతం మంది ప్రజలు రెండో డోస్‌ వేసుకోలేదని వెల్లడించారు. రాష్ట్రంలో 50 లక్షల వ్యాక్సిన్‌ నిల్వ ఉందని తెలిపారు. సెకండ్‌ డోస్‌ గడువు ముగిసినా నేటికీ తీసుకోని వారు 36.35 లక్షల మంది ఉన్నారని పేర్కొన్నారు.

వ్యాక్సిన్‌ తీసుకోని వారిలో 60 శాతం మందికి వైరస్‌ సోకుతుందని హెచ్చరించారు. ఫస్ట్‌ డోస్‌ తీసుకున్న వారిలో 30 శాతం మందికి కరోనా సోకే అవకాశాలున్నాయని, వారు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. రెండు డోస్‌లు తీసుకున్న వారిలో 5 నుంచి 10 శాతం మందికి కోవిడ్‌ సోకే అవకాశాలున్నాయని వివరించారు. రాష్ట్రంలో 69 లక్షల మంది ఇంకా ఒక్క డోస్‌ కూడా తీసుకోలేదని వెల్లడించారు. చిన్న పిల్లలకు వచ్చే రెండు మూడు వారాల్లో వాక్సినేషన్‌ ప్రారంభిస్తామని తెలిపారు.   

చర్చ కోసమే మాస్కు పెట్టుకోలేదు
తాను మాస్కు వేసుకోకపోవడంపై హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాస్‌రావు స్పష్టతనిచ్చారు. ప్రజల్లో చర్చ జరగాలనే ఉద్దేశంతోనే మాస్కు పెట్టుకోకుండా ఇటీవల డ్యాన్స్‌ చేసినట్లు వెల్లడించారు. మాస్కు వేసుకోకుంటే జరిగే ప్రమాదాన్ని ప్రజలకు తెలియజేసేందుకే ఇలా చేశానన్నారు.

మరిన్ని వార్తలు