‘విద్యుత్‌’ను ప్రైవేటీకరిస్తే భవిష్యత్తు అంధకారమే.. 

29 Oct, 2022 00:57 IST|Sakshi
ర్యాలీగా వెళ్తున్న విద్యుత్‌ ఉద్యోగులు  

స్టేట్‌ పవర్‌ ఎంప్లాయీస్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ సదస్సులో వక్తలు   

సాక్షి, హైదరాబాద్‌: పేదలకు, వృత్తిదారులకు, రైతు సంక్షేమానికి విఘాతంగా మారిన విద్యుత్‌ సవరణ బిల్లు–2022ను తక్షణమే ఉపసంహరించుకోవాలని, ప్రభుత్వ విద్యుత్‌ సంస్థలను ప్రైవేటీకరించే యోచనను విరమించుకోవాలని తెలంగాణ స్టేట్‌ పవర్‌ ఎంప్లాయీస్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ(టీఎస్‌పీఈ జేఏసీ) కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. రాష్ట్ర ప్రభుత్వాలు, విద్యుత్‌ ఉద్యోగులు ఎంతో కష్టపడి తయారు చేసుకున్న డిస్ట్రిబ్యూషన్‌ వ్యవస్థలను అంబాని, అదానీలకు కట్టబెట్టడం దారుణమని విమర్శించింది.

విద్యుత్‌ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా శుక్రవారం ఇక్కడ ఖైరతాబాద్‌ ఇంజనీర్స్‌ భవన్‌లో విద్యుత్‌ ఉద్యోగుల రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించారు. అంతకు ముందు మింట్‌ కాంపౌండ్‌ నుంచి ఎన్టీఆర్‌మార్గ్‌ మీదుగా ఇంజనీర్లు ప్లకార్డులు చేతబట్టి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర ప్రణా ళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌ కుమార్, విద్యుత్‌ ఉద్యోగుల జేఏసీ జాతీయ చైర్మన్‌ శైలేంద్ర దూబే మాట్లాడుతూ స్టాడింగ్‌ కమిటీ ఆమోదం లేకుండా విద్యుత్‌ సవరణ బిల్లును దొడ్డిదారిలో పార్లమెంట్‌లో పెట్టి ఆమోదం పొందేందుకు కేంద్రం యత్నిస్తోందని ఆరోపించారు.

ఈ బిల్లును అడ్డుకునేందు కు పోరాటాన్ని తీవ్రతరం చేయాల్సి ఉందని, అవసరమైతే ప్రజాప్రతినిధుల ఇళ్లకు విద్యుత్‌ సరఫరా నిలిపివేసి నిరసన తెలపాలని సూచించారు. విద్యుత్‌ప్రైవేటీకరణతో భవిష్యత్తులో పేదల జీవితాల్లో చీకట్లు తప్పవని హెచ్చరించారు. విద్యుత్‌ సంస్థలు, బొగ్గు గనుల ప్రైవేటీకరణను నిరసిస్తూ నవంబర్‌ 23న చలో ఢిల్లీ కార్యక్రమం నిర్వ హిస్తున్నట్లు తెలి పారు.

ఈ కార్యక్రమానికి టీఆర్‌ఎస్‌ సంపూర్ణ మద్దతు ఇస్తుందని వినోద్‌ చెప్పారు. బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామిక విలువలను కాలరాస్తోందని కార్యక్రమంలో ఉద్యోగుల జేఏసీ చైర్మన్‌ సాయిబాబు, ఆల్‌ ఇండియా కిసాన్‌ సభ ప్రతినిధులు సాగర్, మోహన్‌శర్మ, జేఏసీ కన్వీనర్‌ రత్నాకర్‌రావు తదితరులు పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు