నా భర్తను చిత్రహింసలు పెడుతున్నారు.. పేపర్‌ లీకేజీ నిందితుడు రాజశేఖర్‌ భార్య సుచరిత హైకోర్టులో పిటిషన్‌ 

21 Mar, 2023 08:13 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీ కేసులో తన భర్త రాజశేఖర్‌ను నేరం ఒప్పుకోవాలని పోలీసులు చిత్రహింసలు పెడుతున్నారని అతని భార్య సుచరిత హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ‘నా భర్తను ఈ నెల 11న పోలీసులు అరెస్ట్‌ చేశారు. 14వ తేదీ వరకు రిమాండ్‌ చేయలేదు. నేరం ఒప్పుకోమని పోలీసులు నా భర్తపై ఒత్తిడి తెస్తున్నారు. నా భర్తను పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. అక్కడ ఆయనను చూసి దిగ్భ్రాంతి చెందాను. ఆ సమావేశం నుంచి వెళ్లేటప్పుడు నా భర్త కుంటుతూ నడుస్తున్నారు. పోలీసుల చిత్రహింసల కారణంగానే ఆ పరిస్థితి వచ్చింది.

ఆరోగ్య పరిస్థితి తెలుకునేందుకు రాజశేఖర్‌ను ఆసుపత్రిలో చేర్చాలి. ఆయనను సిట్‌ విచారణ చేస్తోంది. ఆ వీడియోను బయటపెట్టాలి. పోలీసుల చిత్ర హింసలపై, పేపర్‌ లీక్‌పై స్వతంత్ర దర్యాప్తు సంస్థ లేదా కమిషన్‌తో విచారణ జరిపించాలి. నా భర్తపై పోలీసులు థర్డ్‌ డిగ్రీ ప్రయోగించకుండా ఆదేశాలు ఇవ్వాలి’అని ఆమె పిటిషన్‌లో కోరారు. ప్రతివాదులుగా డీజీపీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సిట్, హైదరాబాద్‌ నగర డీసీపీలను పేర్కొన్నారు. ఆమె పిటిషన్‌ను విచారించిన హైకోర్టు.. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించింది. అభ్యంతరాలు ఉంటే సంబంధిత కోర్టును ఆశ్రయించవచ్చని తెలిపింది.
చదవండి: రేవంత్‌కు సిట్‌ నోటీసులు.. మరోసారి కౌంటర్‌

మరిన్ని వార్తలు