పేపర్‌ లీక్‌ కేసు: సిట్‌ ఆఫీస్‌లో ముగిసిన అనితా రామచంద్రన్‌ విచారణ

1 Apr, 2023 12:54 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నిర్వహించే పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజ్‌ కేసులో సిట్‌ దర్యాప్తుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇంతకాలం లీకేజీ రాయులు, అభ్యర్థులు, టీఎస్‌పీఎస్సీ ఉద్యోగులనే ప్రశ్నించిన దర్యాప్తు బృందం, ఇప్పుడు ఏకంగా కమిషన్‌లోని సభ్యులపైనే దృష్టిసారించింది. ఈ క్రమంలో.. ఇవాళ కమిషన్‌ సెక్రెటరీ అనితా రామచంద్రన్‌(ఐఏఎస్‌)ను సిట్‌ విచారించింది.  

శనివారం ఉదయం హిమాయత్‌నగర్‌లోని సిట్‌ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు అనితా రామచంద్రన్‌. సుమారు రెండు గంటలపాటు ఆమెను సిట్‌ చీఫ్‌ ఏఆర్‌ శ్రీనివాస్‌ ఆధ్వర్యంలోని టీం ప్రశ్నించినట్లు తెలుస్తోంది. సిట్‌ అధికారులు ఈ మేరకు ఆమె నుంచి స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు.  

ప్రశ్నాపత్రాల తయారీ, వాటిని భద్రపర్చడం తదితర వ్యవహరాలన్నీ కాన్ఫిడెన్షియల్‌ విభాగం పరిధిలోనే ఉంటాయి. ఈ విభాగం పూర్తిగా సెక్రెటరీ అయిన అనిత పర్యవేక్షణలోనే ఉంటుంది. అయితే కాన్ఫిడెన్షియల్‌ విభాగంలో పని చేసే శంకర్ లక్ష్మి కంప్యూటర్‌ని హ్యాక్ చేసి.. ప్రశ్నాపత్రాలు కొట్టేసినట్లు సిట్‌ ఇదివరకే ధృవీకరించుకుంది. ఈ నేపథ్యంలోనే అనితా రామచంద్రన్‌ను సిట్‌ విచారించింది. మరోవైపు పేపర్‌ లీకేజ్‌లో నిందితుడిగా ఉన్న రమేష్‌,  కమిషన్‌ సభ్యుడైన లింగారెడ్డికి పీఏగా తెలుస్తోంది. వీరిద్ధిరి మధ్య సత్సబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో.. అనితకు, లింగారెడ్డిలకు సీఆర్‌పీసీ సెక్షన్‌ 91, సెక్షన్‌ 160ల ప్రకారం వీళ్లిద్దరికీ సిట్‌ నోటీసులు జారీ చేసింది.  అనితా రామచంద్రన్‌, లింగారెడ్డిలు అందించే వివరాలను బట్టి.. సిట్‌ కమిషన్‌లోనే మరికొందరికి నోటీసులు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.

>
మరిన్ని వార్తలు