TSPSC పేపర్‌ లీకులో వరుస అరెస్టులు: ఒకరికి తెలియకుండా మరొకరు..

27 Mar, 2023 11:32 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో నిరుద్యోగుల్ని కుదిపేసి.. రాజకీయంగానూ ప్రకంపనలు సృష్టించిన పేపర్ల లీక్‌ వ్యవహారంలో వరుస అరెస్టులు చోటు చేసుకుంటున్నాయి.  నిందితులు ఒకరికి తెలియకుండా మరొకరు పేపర్లు అమ్ముకుని.. ఒక్కొక్కరుగా బయట పడుతున్నారు. తాజాగా.. ఈ కేసులో మరొకరిని అరెస్ట్‌ చేసింది సిట్‌. మహబూబ్‌నగర్ గండీడ్‌కు చెందిన తిరుపతయ్య అనే అభ్యర్థిని సిట్‌ అరెస్ట్‌ చేసింది. దీంతో.. 

పేపర్‌ లీక్‌ కేసులో అరెస్టుల సంఖ్య 15కి చేరింది. మొదట.. ఈ కేసులో ఒకేసారి తొమ్మిది మందిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ తొమ్మిది మంది సిట్‌ విచారణలో ఇచ్చిన సమాచారంతో మరో ముగ్గురిని అరెస్ట్‌ చేశారు. ఆపై మరో ఇద్దరినీ, తాజాగా తిరుపతయ్యను అరెస్ట్‌ చేసింది సిట్‌.  డాక్యా నాయక్‌ నుంచి తిరపతయ్య ఏఈ పేపర్‌ను కొనుగోలు చేసినట్లు సిట్‌ దర్యాప్తులో తేలింది. అంతేకాదు ఈ కేసులో నిందితురాలు రేణుక, తిరుపతయ్య ఒకే ప్రాంతానికి చెందిన వాళ్లు కావడం గమనార్హం. 

ఇదిలా ఉంటే.. సిట్‌ ఇవాళ నిందితులను మళ్లీ కస్టడీలోకి తీసుకోనుంది. దీంతో మరిన్నిపేర్లు బయటపడొచ్చని, అరెస్టులు జరగొచ్చని అర్థమవుతోంది. గ్రూప్ -1(Group 1) ప్రిలిమ్స్‌లో(రద్దైంది) 100కుపైగా మార్కులు వచ్చినవాళ్లను సిట్‌ పిలిచి విచారిస్తున్నట్లు సమాచారం. వాళ్లకు 15 అంశాలతో కూడిన ప్రశ్నావళి రూపొందించి సమాధానాలు ఇవ్వాలని కోరుతుందని తెలుస్తోంది.

ప్రస్తుతం సిట్ కార్యాలయంలో నిందితుల విచారణ కొనసాగుతోంది. ప్రవీణ్ , రాజశేఖర్ , డాక్య నాయక్ , కేతావత్ రాజేశ్వర్ లను రెండో రోజు కస్టడీలోకి తీసుకుని సీసీఎస్‌ కార్యాలయానికి తరలించి విచారిస్తున్నారు సిట్ అధికారులు.

ఇదీ చదవండి: తెలుగు రాష్ట్రాల నడుమ మరో వందేభారత్‌

మరిన్ని వార్తలు