భారమైన స్టూడెంట్‌ బస్‌పాస్‌ చార్జీలు.. ఐదు కిలో మీటర్లకు రూ.35, పాత, కొత్త చార్జీలు ఇలా!

27 Jun, 2022 19:14 IST|Sakshi
మిర్యాలగూడ ఆర్టీసీ బస్టాండ్‌లోని బస్‌పాస్‌ కౌంటర్‌  

పెరిగిన చార్జీలతోనే విద్యార్థులకు రాయితీ బస్‌పాస్‌లు

ఆర్టీసీలో ప్రారంభమైన బస్‌పాస్‌ల జారీ ప్రక్రియ

ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ  

మిర్యాలగూడ టౌన్‌ : ఆర్టీసీలో బస్‌పాస్‌ల జారీ ప్రక్రియ ప్రారంభమైంది. విద్యాసంస్థలు ప్రారంభమై పక్షం రోజులు కావడంతో ఆ సంస్థ అధికారులు ఇప్పటికే ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. అయితే, ఈ విద్యా సంవత్సరం పెరిగిన చార్జీలతోనే విద్యార్థులకు కూడా రాయితీ బస్‌ పాస్‌లను జారీ చేయనున్నట్లు ఆ సంస్థ అధికారులు ప్రకటించారు. దీంతో గత ఏడాదితో పొలిస్తే ప్రస్తుత విద్యా సంవత్సరంలో విద్యార్థులపై అదనంగా భారం పడుతోంది.

ఐదు కిలో మీటర్ల ప్రయాణిస్తే పెరిగిన చార్జీల కారణంగా భారం రూ.35 పడుతుండగా ఆపై కిలో మీటర్లు ప్రయాణించే విద్యార్థులకు అదనంగా చెల్లించాల్సిందేనని ఆ సంస్థ అధికారులు స్పష్టం చేస్తున్నారు.  విద్యార్థులు బస్‌పాస్‌ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న వెంటనే సంబంధిత పాఠశాల, కళాశాల యాజమాన్యానికి ఇచ్చిన లాగెన్‌లోకి వెళ్తుంది. ఆ విద్యా సంస్థల యాజమాన్యం విద్యార్థులు చేసుకున్న దరఖాస్తులను ధ్రువీకరించి తిరిగి ఆర్టీసీ అధికారులకు పంపిస్తే ఆయా బస్టాండ్‌లోని కేంద్రాల్లో బస్‌పాస్‌లను పొందవచ్చని పేర్కొంటున్నారు. 
చదవండి👉🏻ఖైరతాబాద్ భారీ గణనాథుని రూపం ఆవిష్కరణ

అడ్మినిస్ట్రేషన్‌ చార్జీలు లేవు 
ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు అడ్మినిస్ట్రేషన్‌ చార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే, ప్రైవేట్‌ విద్యాసంస్థల్లో అభ్యసించే విద్యార్థులకు ఈ సదుపాయం వర్తించదని ఆ సంస్థ అధికారులు పేర్కొంటున్నారు. బస్‌పాస్‌ పొందాలనుకునే విద్యార్థులు తొలుత అకౌంట్‌ ఆఫీసర్, టీఎస్‌ఆర్టీసీ నల్లగొండ పేరిట డీడీ తీయాల్సి ఉంటుంది. యాజమాన్యం ఆ డీడీని తీసుకువచ్చి సంబంధిత బస్టాండ్‌ బస్సుపాస్‌ కౌంటర్లలో నమోదు చేయించాలి. అనంతరం ఇనిస్టిట్యూట్‌ వివరాలు బస్సుపాస్‌ కౌంటర్లలో పొందుపరుస్తారు. వెంటనే నమోదు చేసిన మొబైల్‌కు యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ వస్తుంది. 

15ఏళ్ల లోపు బాలికలు, 12ఏళ్ల లోపు బాలురకు ఉచితంగా..
గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు మధ్యలోనే చదువు మానేయకుండా, బాలికలను విద్యలో ప్రోత్సహించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే ఆర్టీసీ 15ఏళ్లలోపు బాలికలు, 12ఏళ్లలోపు బాలురకు ఉచిత బస్‌పాస్‌ సౌకర్యం కల్పిస్తోంది. అదే విధంగా ప్రభుత్వ విద్యా సంస్థల్లో కూడా అడ్మినిస్ట్రేషన్‌ చార్జీలపై ఆర్టీసీ రాయితీని అందిస్తోంది. విద్యార్థులు దీనిని సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ అధికారులు కోరుతున్నారు. 
చదవండి👉🏻ఇష్టం లేని పెళ్లి.. పిల్లలు పుట్టడానికి మందు అని చెప్పి, ప్రియుడితో కలిసి

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి
ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు బస్‌పాస్‌ పొందేందుకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు  చేసుకోవాలి. ఇప్పటికే ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను ప్రారంభించాం. ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలు వారికి కేటాయించిన విధంగా ప్రెష్, రెన్యువల్‌ ఆడ్మినిస్ట్రేషన్‌ చార్జీలను తక్షణమే చెల్లించాలి.
– బొల్లెద్దు పాల్, ఆర్టీసీ డిపో మేనేజర్, మిర్యాలగూడ

మరిన్ని వార్తలు