టీఎస్‌ఆర్టీసీ దోపిడీ.. రెండు రకాలుగా విద్యార్థులను ముంచుతోంది

22 Dec, 2021 10:32 IST|Sakshi
లేట్‌ ఫీజ్, నాలుగు రోజుల తగ్గింపుతో జారీ చేసిన విద్యార్థి బస్‌పాస్‌

ఆర్టీసీ బస్‌పాస్‌ ఆలస్యంగా తీసుకున్నందుకు అపరాధ రుసుము

30 రోజులకు బదులు 26 రోజుల వ్యాలిడిటీ

ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు

సాక్షి,హన్మకొండ: బస్‌పాస్‌ల జారీలో టీఎస్‌ ఆర్టీసీ దోపిడీకి పాల్పడుతోంది. రెండు రకాలుగా విద్యార్థులను ముంచుతోంది. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తామని, సుఖవంతమైన, సురక్షిత ప్రయాణానికి ఆర్టీసీ బస్సులో ప్రయాణించాలని చెప్పుకుంటున్న ఆర్టీసీ.. ప్రయాణికులకు సేవల పట్ల నిర్లక్ష్యం చూపుతోందని విమర్శలు వినవస్తున్నాయి. ప్రయాణికులకు ఆర్టీసీని మరింత చేరువ చేసేల ఆర్టీసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సోషల్‌ మీడియా వేదికగా ట్విట్టర్‌లో అనేక ట్వీట్‌లు చేస్తున్నారు. మరో వైపు కనిపించకుండా మోసాలు జరుగుతూనే ఉన్నాయి.

నెలవారీగా జారీ చేసే పాస్‌లలో తమకు అన్యాయం చేస్తున్నారని విద్యార్థులు మొత్తుకుంటున్నారు. పరిస్థితులు అనుకూలించకుండా అనారోగ్యంతో కానీ, మరే ఇతర కారణాలతో ఆలస్యంగా విద్యార్థి పాస్‌ తీసుకుంటే ఆలస్యం అయినందుకు అపరాధ రుసుం వసూలు చేయడంతో పాటు రోజులు తగ్గిస్తున్నారని విద్యార్థులు మొత్తుకుంటున్నారు. ఆలస్యం అయినందుకు రూ.10 వసూలు చేయడంతో పాటు రోజులు తగ్గిస్తున్నారని తెలిపారు. రెడ్డికాలనీకి చెందిన సాయి జాహ్నవి యాదవనగర్‌ నుంచి కేయూసీ క్రాస్‌ రోడ్డు వరకు విద్యార్థి పాస్‌ను ఈ నెల 21న (మంగళవారం) పాస్‌ రెన్యువల్‌ చేయించుకుంది.

రూ.70 చార్జీతో పాటు రూ.10 లేట్‌ ఫీ, రూ.20 సర్వీస్‌ చార్జీ తీసుకుని జనవరి 16వ తేదీ వరకు మాత్రమే బస్‌పాస్‌ జారీ చేశారు. నిబంధనల ప్రకారం ఈ నెల 21న పాస్‌ తీసుకుంటే వచ్చే నెల 20వ తేదీ గడువుతో పాస్‌ జారీ చేయాలి. అయితే 4 రోజులు తగ్గించి జారీ చేశారు. ఆలస్యపు రుసుంతో పాటు నెల రోజులకు డబ్బులు తీసుకుని 24 రోజులకు మాత్రమే పాస్‌ ఎలా జారీ చేస్తారని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. ఆర్టీసీ యాజమాన్యం, అధికారులు స్పందించి లోపాలు సరిదిద్దాలని కోరుతున్నారు. 

చదవండి: గుట్కాలు కొన్న విషయం ప్రిన్సిపాల్‌కి తెలియడంతో.. ఏం జరుగుతుందోనని భయపడి..

మరిన్ని వార్తలు