Hyderabad: ఐటీ ఉద్యోగులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త..

1 Dec, 2022 08:50 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఐటీ ఉద్యోగులకు శుభవార్త. నగరంలోని ఐటీ కారిడార్‌లో ప్రత్యేక షటిల్‌ బస్‌లను నడపాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) నిర్ణయించింది. హైటెక్‌సిటీ, మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లో ఈ సర్వీస్‌లను త్వరలోనే నడిపేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఐటీ ఉద్యోగులు వ్యక్తిగత వాహనాల్లో గంటల కొద్దీ ప్రయాణించి అవస్థలు పడుతుండడంతో ప్రత్యేక షటిల్‌ సర్వీసుల సదుపాయంతో తక్కువ వ్యయంతోనే సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవచ్చని ఆర్టీసీ అధికారులు తెలిపారు.

ఈ షటిల్‌ సర్వీస్‌ల కోసం ఆన్‌లైన్‌ సర్వే ద్వారా ఐటీ ఉద్యోగుల నుంచి అభిప్రాయాలను టీఎస్‌ఆర్టీసీ కోరుతోంది. ఆ సర్వే వివరాల మేరకు భవిష్యత్‌లో ఐటీకారిడార్‌లో మరిన్ని షటిల్‌ సరీ్వసులను నడుపుతామని ప్రకటించింది. ఈ షటిల్‌ సర్వీస్‌ సదుపాయాన్ని వినియోగించుకోవాలనుకునే ఐటీ ఉద్యోగులు ‘షార్ట్‌యూఆర్‌ఎల్‌.ఏటీ/ఏవీసీహెచ్‌ఐ’ లింక్‌పై క్లిక్‌ చేసి వివరాలను నమోదు చేసుకోవాలని టీఎస్‌ఆర్టీసీ సూచించింది. ఉద్యోగులు తమ కంపెనీ వివరాలు, లొకేషన్, పికప్, డ్రాపింగ్‌ ప్రాంతాలను విధిగా నమోదు చేయడంతో పాటు తమ విలువైన సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరింది.  
  
బుకింగ్‌కు ప్రత్యేక యాప్‌... 
ఐటీ ఉద్యోగులు సురక్షితంగా గమ్యస్థానాలను చేర్చడమే ప్రత్యేక షటిల్‌ బస్‌ సర్వీస్‌ ప్రధాన ఉద్దేశం. అందుకు సాంకేతికత ద్వారా ఈ సేవలను సులువుగా అందించాలని టీఎస్‌ఆర్టీసీ నిర్ణయించింది. ఈ సేవలను వినియోగించుకునేందుకు ప్రత్యేక యాప్‌ను రూపొందిస్తోంది. ఆ యాప్‌లోనే టికెట్‌ బుకింగ్‌ సదుపాయాన్ని కల్పించనుంది. ఈ సరీ్వస్‌లకు ట్రాకింగ్‌ సదుపాయం కూడా ఉంది. ప్రస్తుతం బస్‌ ఎక్కడుంది,

ఏఏ ప్రాంతాల్లో తిరుగుతుంది అనే విషయాలను ట్రాకింగ్‌ సదుపాయం ద్వారా తెలుసుకోవచ్చు. మహిళల భద్రత నేపథ్యంలో షటిల్‌ బస్సుల్లో ట్రాకింగ్‌ సదుపాయాన్ని కల్పించినట్లు టీఎస్‌ఆర్టీసీ తెలిపింది. యాప్‌లో  సర్వీస్‌ నంబర్, డ్రైవర్, కండక్టర్‌ ఫోన్‌ నంబర్లు, ఇతర వివరాలూ ఉంటాయని వివరించింది. ఈ సదుపాయాన్ని ఐటీ ఉద్యోగులు విరివిగా వినియోగించుకోవాలని సూచించింది.   
చదవండి: అమెరికా టూ ఇండియా!.. తక్కువ ధరకే విమాన టికెట్‌.. నమ్మితే అంతే!

మరిన్ని వార్తలు