TSRTC Ticket Prices: గుట్టుచప్పుడు కాకుండా ఆర్టీసీ చార్జీల బాదుడు.. ఏ స్టాప్‌కు ఎంత పెంచారంటే?

19 Mar, 2022 08:19 IST|Sakshi

ప్రతి 2 నుంచి 6 కిలో మీటర్లకు రూ.5 పెంపు

 ఆర్డినరీ బస్సుల్లో మొదటి 4 స్టేజీలు..  

మెట్రోలో మొదటి 2 స్టేజీల వరకు యథాతథం

మూలనిధి కోసమే సర్దుబాటు అంటున్న ఆర్టీసీ

16 లక్షల మంది ప్రయాణికులపై ప్రభావం

గ్రేటర్‌ పరిధిలో నెలకు రూ.6 కోట్లకుపైగా భారం 

సాక్షి, హైదరాబాద్‌ : ఆర్టీసీ గుట్టుచప్పుడు కాకుండా చార్జీలు పెంచింది. శుక్రవారం తెల్లవారుజాము నుంచే పెరిగిన చార్జీలు అమల్లోకి వచ్చేలా గ్రేటర్‌ హైదరాబాద్‌లోని అన్ని డిపోలకు  సందేశాలు చేరాయి. సాధారణ చార్జీల పెంపు కాకుండా సేఫ్టీ సెస్‌ రూపంలో వీటిని పెంచింది. ప్రమాదాలు, విపత్తులు, వాహనాల బీమా తదితర అవసరాల దృష్ట్యా ఆర్టీసీ మూలనిధి కోసం కొత్తగా భద్రతా సెస్‌ చార్జీలను విధించినట్లు ఆర్టీసీ ఉన్నతాధికారి ఒకరు  తెలిపారు.

ఈ మేరకు గ్రేటర్‌లో ఆర్డినరీ బస్సులకు నాలుగు స్టేజీల వరకు అంటే 8 కిలో మీటర్ల వరకు ప్రస్తుతం ఉన్న చార్జీలే యథాతథంగా ఉంటాయి. ఆ తర్వాత ప్రతి మూడు, నాలుగు స్టేజీలకు రూ..5 చొప్పున పెంచారు. మెట్రో ఎక్స్‌ప్రెస్, మెట్రో డీలక్స్‌ బస్సుల్లో మొదటి రెండు స్టేజీల వరకు  చార్జీలు యథాతథంగానే ఉన్నాయి. ఆ తర్వాత రూ.5 చొప్పున పెరిగాయి.  

ప్రయాణికులపై తప్పని భారం.. 
ఆర్టీసీ మూల నిధి కోసం ఇప్పుడు ఉన్న చార్జీలపై భద్రతా సెస్‌ రూపంలో మాత్రమే అదనపు చార్జీలను విధిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. నగరంలోని ప్రయాణికులపై ప్రతి నెలా రూ.5 కోట్ల నుంచి రూ.6 కోట్లకుపైగా అదనపు భారం పడనుంది. నగరంలో ప్రతిరోజు సుమారు 16 లక్షల మంది ప్రయాణికులు ఆర్టీసీ సేవలను వినియోగించుకుంటున్నారు. వీరిలో మెట్రో బస్సుల్లో  మొదటి  రెండు స్టేజీలు, ఆర్డినరీ బస్సుల్లో మొదటి నాలుగు స్టేజీలు ప్రయాణించే వారు నాలుగైదు లక్షల మంది మాత్రమే ఉంటారు. మిగతా ప్రయాణికులకు సిటీ బస్సుల్లో  ప్రయాణం భారంగా మారింది.  
చదవండి: యూనివర్సల్‌ బేకరీ.. ఓ స్వీట్‌ మెమొరీ.. మూతపడటానికి కారణాలేమిటి? 

ఆర్డినరీ బస్సుల్లో..  
►ప్రస్తుతం ఆర్డినరీ బస్సుల్లో మొదటి రెండు స్టేజీలకు ప్రస్తుతం ఉన్న రూ.10 చార్జీలో ఎలాంటి మార్పు ఉండదు. ఆ తర్వాత మరో రెండు స్టేజీల వరకు ప్రస్తుతం ఉన్న రూ.15 చార్జీ యథావిధిగా  ఉంటుంది. అంటే ప్రయాణికులు తాము బయలుదేరిన చోటు నుంచి 4 స్టేజీల వరకు అంటే 8 కి.మీ వరకు పాత చార్జీల ప్రకారమే చెల్లించాల్సి ఉంటుంది. 

►10 కి.మీ తర్వాత చార్జీల పెంపు అమల్లోకి వస్తుంది. ఈ మేరకు 5వ స్టేజీ నుంచి రూ.5 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ మేరకు 5 స్టేజీల వరకు ఇప్పటి వరకు రూ.15 చార్జీ ఉండగా ప్రస్తుతం రూ.20 కి పెంచారు.  

► 6వ స్టేజీ నుంచి 9వ స్టేజీ వరకు అంటే 12 కి.మీ నుంచి  18 కి.మీ వరకు ఇప్పుడు ఉన్న చార్జీని రూ.20 నుంచి రూ.25కు పెంచారు.  

►ఆ తర్వాత 10వ స్టేజీ అంటే  20 నుంచి 28 కి.మీ (14వ స్టేజీ) వరకు ఇప్పటి వరకు రూ.25 ఉండగా తాజాగా రూ.30కి 
పెంచారు.  

►30 కి.మీ నుంచి 40 కి.మీ వరకు అంటే  15వ స్టేజీ నుంచి 19వ స్టేజీ వరకు ఇప్పటి వరకు రూ.30 చార్జీ ఉండగా దానిని తాజాగా రూ.35కు పెంచారు.  
► 40 కి.మీ వరకు (20వ స్టేజీ) ఇప్పటి వరకు రూ.35 ఉండగా, తాజాగా రూ.40కి పెంచారు.

మెట్రో ఎక్స్‌ప్రెస్‌లో... 
►మూడో స్టేజీ వరకు అంటే 6 కి.మీ వరకు ఇప్పుడున్న రూ.15ను రూ.20కి పెంచారు. ఆ తర్వాత 8 నుంచి 14 కి.మీ వరకు అంటే 4వ స్టేజీ నుంచి 7వ స్టేజీ వరకు ఇప్పుడు ఉన్న రూ.20 చార్జీలను రూ.25కు పెంచారు. 

►16 కి.మీ నుంచి 24 కి.మీ వరకు అంటే  8వ స్టేజీ నుంచి 12వ స్టేజీ వరకు రూ.25 నుంచి రూ.30కి పెంచారు. ఆ తర్వాత 4 స్టేజీల వరకు రూ.5 చొప్పున అంటే రూ.30 నుంచి రూ.35కు పెంచారు. 36 కి.మీ నుంచి (17వ స్టేజీ నుంచి) 40 కి.మీ వరకు (20వస్టేజీ వరకు) రూ.35 నుంచి  రూ.40కి పెంపు.  
 
మెట్రో డీలక్స్‌ బస్సుల్లో.. 
►మొదటి 2 కి.మీ వరకు రూ.15 చార్జీలో  ఎలాంటి మార్పు లేదు. 4 కి.మీటర్లకు రూ.15 నుంచి రూ.20కి పెంచారు. ఆ తర్వాత 6 కి.మీ నుంచి (3వ స్టేజీ నుంచి) 12 కి.మీ వరకు (6వ స్టేజీ) రూ.20 నుంచి రూ.25కు చార్జీలు పెంచారు. 
► 8వ స్టేజీ నుంచి అంటే 14 నుంచి 22 కి.మీ వరకు (11వ స్టేజీ)రూ.25 నుంచి రూ.30కి పెంచారు. ఆ తర్వాత రెండు స్టేజీల వరకు అంటే 26 కి.మీ వరకు రూ.30 నుంచి రూ.35 చొప్పున, ఆ తర్వాత వచ్చే రెండు స్టేజీల వరకు అంటే  30 కి.మీ వరకు రూ.35 నుంచి రూ.40 చొప్పున చార్జీలు పెరిగాయి.  
►17వ స్టేజీ నుంచి 18వ స్టేజీ వరకు అంటే 34 కి.మీ నుంచి 36 కి.మీ వరకు రూ.40 నుంచి రూ.45కు పెంచారు.  
►18వ స్టేజీ నుంచి 20వ స్టేజీ వరకు అంటే 36 నుంచి 40 కి.మీ  వరకు ఇప్పటి వరకు ఉన్న చార్జీ రూ.45 నుంచి రూ.50కి పెంచారు. 

మరిన్ని వార్తలు