బస్టాప్‌లో బస్సులు ఆపడం లేదని యువతి ఆవేదన.. నెటిజన్‌ ట్వీట్‌కు సజ్జనార్‌ రిప్లై

27 Sep, 2022 11:32 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో రాత్రి సమయాల్లో బస్టాప్‌లో బస్సలు సరిగా ఆపడం లేదంటూ ఓ నెటిజన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఓ ప్రైవేటు సంస్థలో పనిచేసే నందిని అనే యువతి తన సమస్యను ట్విటర్‌ వేదికగా తెలియజేస్తూ ఆర్టీసీ యాజమాన్యం దృష్టికి తీసుకొచ్చింది.‘దయచేసి మీ డ్రైవర్స్ కి చెప్పండి ప్రతి బస్టాప్ లో బస్సులు ఆపమని 9:52 నుంచి 10:02 వరకు పటాన్‌చెరు ఆల్విన్ బస్టాప్‌లో ఒక్క బస్సు కూడా ఆపలేదు. చేయి చూపించిన కూడా ఆపలేదు. ఇలా ఇప్పటికి చాలా సార్లు జరిగింది, ఆర్టీసీ అంటే పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్టు. స్టాప్‌లలో కాకుండా ఇంకెక్కడ ఆపుతారు. దయచేసి అవసరమైనవి చేయండి’ అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు. ఆర్టీసీ ఎంజీ సజ్జనార్‌, టీఎస్‌ఆర్టీసీ ట్విటర్‌లను ట్యాగ్‌ చేశారు.

అయితే యువతి చేసిన ట్వీట్‌కు టీఎస్‌ ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ స్పందించారు. సంబంధిత అధికారులు దీనిని పరిశీలించి చర్యలు తీసుకోవాలంటూ  టీఆఎస్‌ఆర్టీసీ ట్విటర్‌ను ట్యాగ్‌ చేశారు. సజ్జనార్‌ ఆదేశాలపై స్పందిస్తూ. యువతికి కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు చెబుతూ. . తమ డ్రైవర్లు, కండక్టర్లకు అల్విన్ బస్ స్టాప్ వద్ద బస్సులను ఆపమని అవగాహన కల్పిస్తామని టీఎస్‌ఆర్టీసీ తెలిపింది. కాగా సాధారణ పౌరులు చెప్పే సమస్యలు, చేసే ట్వీట్లపై వెంటనే సమాధానమిచ్చే సజ్జనార్‌పై పలువురు నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

మరిన్ని వార్తలు