TSRTC MD Sajjanar: నిమజ్జనం ప్రత్యేకత చాటుకున్న ఆర్టీసీ ఎండీ

19 Sep, 2021 15:13 IST|Sakshi

వినాయకుడి నిమజ్జనానికి ఆర్టీసీ బస్సులో ప్రయాణం

కుటుంబసభ్యులతో కలిసి సందడి

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సమితి (ఆర్టీసీ) ఎండీగా బాధ్యతలు చేపట్టిన వీసీ సజ్జనార్‌ మరోసారి ప్రత్యేకత చాటుకున్నారు. మొన్న ఆర్టీసీ బస్సు, బస్టాండ్‌లో సాధారణ వ్యక్తిలా ప్రయాణించి క్షేత్రస్థాయిలో ఆర్టీసీ సేవలను పరిశీలించారు. తాజాగా గణేశ్‌ నిమజ్జనం సందర్భంగా ఆర్టీసీ బస్సులోనే వినాయకుడిని నిమజ్జనానికి తీసుకెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. 

కుటుంబసభ్యులతో కలిసి సజ్జనార్‌ వినాయకుడి ప్రతిమను తీసుకుని బస్సులో బయల్దేరారు. ఈ సందర్భంగా సజ్జనార్‌ తెలుపు దుస్తులు ధరించి తలపై టోపీ పెట్టుకుని మహారాష్ట్ర లుక్‌లో కనిపించారు. వినాయక విగ్రహంతో బస్సులో కూర్చుని ఉండగా భక్తులు నినాదాలు చేస్తున్నారు. కొందరు ఉత్సాహంగా డ్యాన్స్‌లు కూడా చేశారు. ఈ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. సంస్థ బాగు కోసం సజ్జనార్‌ చేస్తున్న ప్రయత్నాలు ఆదర్శంగా నిలుస్తున్నాయని నెటిజన్లు అభినందిస్తున్నారు. సజ్జనార్‌ నేతృత్వంలో ఆర్టీసీకి పూర్వ వైభవం వస్తుందని, ఆర్టీసీ లాభాల బాట పడుతుందని పేర్కొన్నారు.
 

మరిన్ని వార్తలు