Tsrtc: వాట్ ఎన్ ఐడియా సర్ జీ.. ఆర్టీసీలో ‘పెళ్లి సందడి’

25 Oct, 2021 08:47 IST|Sakshi

 అడ్వాన్సు, సెక్యూరిటీ డిపాజిట్‌ రద్దు 

ప్రైవేటు కంటే తక్కువ చార్జీ 

ఆర్టీసీ బస్సులవైపే పెళ్లివారి మొగ్గు 

సాక్షి, హైదరాబాద్‌: ఆర్టీసీ ‘పెళ్లి సందడి’కి ముస్తాబైంది. నష్టాల బాట వీడి లాభాల కోసం తహతహలాడుతున్న టీఎస్‌ఆర్టీసీ, అందివచ్చే ప్రతి అవకాశాన్ని సది్వనియోగం చేసుకోవాలనుకుంటోంది. ఇందుకోసం పెళ్లిళ్ల సీజన్‌ను బాగా వినియోగించుకోవాలని నిర్ణయించింది. పెళ్లిళ్లకు బస్సులను అద్దెకిచ్చేందుకు ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేసుకుంటోంది. ప్రస్తుతం వివాహ ముహూర్తాలు ప్రారంభం కావటంతో బస్సులను అద్దెకు తీసుకొమ్మంటూ ముమ్మర ప్రచారం చేస్తోంది.

నవంబరు నుంచి కనీసం రోజుకు వంద బస్సులు అద్దెకిచ్చేలా టార్గెట్‌ పెట్టుకుంది. పెళ్లివారిని ఆకట్టుకునేందుకు గాను, సెక్యూరిటీ డిపాజిట్‌ను రద్దు చేసింది. మొత్తం చార్జీలో 20 శాతాన్ని అడ్వాన్సుగా చెల్లించాల్సి వచ్చేది. ఇప్పుడు దాన్నీ రద్దు చేయటంతో ప్రైవేటు బస్సుల కంటే ఆర్టీసీ బస్సుల వైపు పెళ్లింటివారు మొగ్గుచూపుతున్నారు. ఆదివారం నుంచి ఈనెల 31 వరకు ఉన్న పెళ్లిళ్లకు ఇప్పటికే 225 బస్సులు బుక్‌ అయ్యాయి. 

అద్దెకు ఇలా.. 
అప్‌ అండ్‌ డౌన్‌ కలిపి గరిష్టంగా 200 కి.మీ. దూరం ఉంటే పికప్‌ అండ్‌ డ్రాప్‌ పద్ధతిలో బస్సులు కేటాయిస్తున్నారు. ఇందుకు కేవలం పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్‌ బస్సులు మాత్రమే అందుబాటులో ఉంటాయి. వెళ్లాల్సిన ప్రాంతానికి ఉన్న బస్సు చార్జీకి 50 శాతం అదనంగా వసూలు (అన్ని సీట్లకు) చేస్తారు. వెళ్లి రావడం, డ్రాప్‌ మాత్రమే చేసి రావటం, పికప్‌ చేసుకోవటం.. ఇలా మూడు పద్ధతులకు ఈ బస్సులు అందుబాటులో ఉంటాయి. ప్రయాణించిన దూరం ఆధారంగా ఛార్జీ వసూలు చేస్తారు. (చదవండి: Banswada: ‘మానవత్వానికి మతం అడ్డుకాదు. చందన నా మూడో కూతురు’ )

100 కి.మీ. దూరం దాటి వెళ్లాల్సి వస్తే.. పల్లె వెలుగు బస్సుల్లో మాత్రం నిర్ధారిత గమ్యానికి ఉన్న బస్సు చార్జీపై 10 శాతం మొత్తాన్ని అదనంగా వసూలు చేస్తారు. ఎక్స్‌ప్రెస్, డీలక్స్, సూపర్‌లగ్జరీ, రాజధాని, గరుడ బస్సులకు మాత్రం ఆ దూరానికి ఉన్న బస్సు చార్జీకి సమాన మొత్తాన్నే (అన్ని సీట్లకు) వసూలు చేస్తారు. నిర్ధారిత సమయాన్ని మించి బస్సు ఉండాల్సి వస్తే, ప్రతి గంటకు (దూరంతో సంబంధం లేకుండా) రూ.300 చొప్పున, ఏసీ బస్సులకు రూ.400 చొప్పున వెయిటింగ్‌ రుసుము వసూలు చేస్తారు.  

ప్రైవేటు బస్సుల కంటే తక్కువ చార్జీ.. 
ఆయా ప్రాంతాలకు వెళ్లే ఆర్టీసీ బస్సుల్లో ఉండే టికెట్‌ చార్జీ ఆధారంగా ఈ పెళ్లి బస్సుల రుసుములను ఆర్టీసీ వసూలు చేస్తోంది. ఈ మొత్తం ప్రైవేటు బస్సుల చార్జీ కంటే తక్కువగా ఉంటోంది. డిమాండ్‌ అంతగా లేని సమయంలో ప్రైవేటు బస్సులు చార్జీ తగ్గించి ఇస్తున్నాయి. డిమాండ్‌ ఎక్కువగా ఉన్న సమయంలో ప్రైవేటు బస్సు చార్జీలు ఆర్టీసీ చార్జీలను మించి ఉంటున్నాయి. ఆర్టీసీ ఎప్పుడూ నిర్ధారిత మొత్తాన్ని మాత్రమే వసూలు చేస్తోంది.

చదవండి: Hyderabad RTC: ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. సిటీ బస్సు ఇక చిటికలో

మరిన్ని వార్తలు