మండే.. ‘మనీ’డే

20 Oct, 2021 02:54 IST|Sakshi

ఆర్టీసీకి రికార్డు స్థాయిలో ఆదాయం 

లక్ష్యం రూ.13.35 కోట్లు.. 

సాధించింది రూ.14.79 కోట్లు 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ఆర్టీసీ రికార్డు స్థాయిలో ఒక రోజు ఆదాయాన్ని పొందింది. సోమవారం ఏకంగా రూ.14.79 కోట్ల ఆదాయాన్ని టికెట్ల రూపంలో సాధించింది. గత మూడేళ్లలో ఇదే అత్యధికం కావటం విశేషం. బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో సొంతూళ్లకు వెళ్లి తిరిగి వచ్చే క్రమంలో సోమవారం 34.37 లక్షల మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారు. కాగా, దసరా రద్దీ నేపథ్యంలో నమోదవుతున్న ఆదా యాన్ని దృష్టిలో ఉంచుకుని సోమవారం రూ.13.35 కోట్లను సంస్థ లక్ష్యంగా నిర్ధారించుకుంది.

111% లక్ష్య సాధనతో రికార్డు సృష్టించింది. గతేడాది ఇదే రోజున రూ.4.80 కోట్లు మాత్రమే సమకూరింది. ఈసారి ఆక్యుపెన్సీ రేషియో 77.15గా నమోదైంది. కి.మీ.కు ఆదా యం (ఈపీకే)రూ.40.74గా నమోదైంది. మొత్తం ఆదాయంలో కరీంనగర్, హైదరాబాద్‌ జోన్‌లు రూ.10.98 కోట్లు సాధించటం విశేషం. ఆదిలాబాద్, రంగారెడ్డి రీజియన్లు మినహా మిగతా 9 జోన్లు 100 శాతాన్ని మించి లక్ష్యాన్ని సాధించాయి. 

సగటున రూ.9 కోట్ల రోజువారీ ఆదాయం
దసరా రద్దీ వేళ ఆర్టీసీ సాధారణ ఆదాయాన్నే పొందింది. బుధవారం నుంచి ఆదివారం వరకు రూ.43.73కోట్ల ఆదాయాన్ని పొందింది. బుధవారం రూ.10.42 కోట్లు, గురువారం రూ.9.93 కోట్ల ఆదాయం వచ్చింది. దసరా, మరుసటి రోజు రూ.5.74కోట్లు, రూ.7.43 కోట్లు వచ్చాయి. మళ్లీ తిరుగుప్రయాణాల్లో ఆదివారం రూ.10.21 కోట్లు వచ్చిపడ్డాయి. కాగా, ఏసీ బస్సుల్లో సగం సీట్లు మిగిలిపోయాయి.
 

మరిన్ని వార్తలు