ఆర్టీసీ వింత నిర్ణయం.. ఇక కష్టమే!

8 Apr, 2021 13:04 IST|Sakshi
నాందేడ్‌కు వెళ్లి తిరిగి వస్తున్న బోధన్‌ డిపో బస్సు 

మహారాష్ట్రకు సర్వీసుల పునరుద్ధరణ

‘మహా ముప్పు’ ఉన్నా రాకపోకలు షురూ

సరిహద్దు పల్లెల్లో పెరుగుతున్న పాజిటివ్‌ కేసులు

సాక్షి, బోధన్‌: మహారాష్ట్రలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోన్న తరుణంలో.. ఆర్టీసీ తీసుకున్న నిర్ణయం విమర్శలకు తావిస్తోంది. పొరుగు రాష్ట్రంలో నిత్యం వేలాది కేసులు నమోదవుతుండగా, ఆ రాష్ట్రానికి బస్సు సర్వీసులను పునరుద్ధరించింది. సోమవారం నుంచి మహారాష్ట్రలోని పలు ప్రాంతాలకు బస్సులు నడుపుతోంది. అయితే, వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా ఉన్న ఆయా ప్రాంతాలకు సర్వీసులు పునరుద్ధరించడం ఆందోళన కలిగిస్తోంది. ‘మహా’ ప్రభావం కారణంగా ఇప్పటికే సరిహద్దుల్లోని మన పల్లెల్లో పాజిటివ్‌ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఇలాంటి తరుణంలో ఆ రాష్ట్రానికి సర్వీసులను పునరుద్ధరించడం విమర్శలకు తావిస్తోంది.

ఏడాదికి పైగా నిలిపివేత..
కరోనా నేపథ్యంలో గతేడాది మార్చి 24 నుంచి ఆర్టీసీ పొరుగు రాష్ట్రానికి బస్సు సర్వీసులను నిలిపి వేసింది. మహారాష్ట్రలో మొదటి నుంచి వైరస్‌ ఉద్ధృతి ఎక్కువగానే ఉంది. ఇటీవల అది మరింత ఎక్కువైంది. నిత్యం వేల సంఖ్యలో అక్కడ కేసులు నమోదవుతున్నాయి. దీంతో పొరుగు రాష్ట్రంలో కర్ఫ్యూతో పాటు కొన్ని నగరాల్లో కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో మరింత అప్రమత్తంగా మన ఆర్టీసీ అధికారులు వింత నిర్ణయం తీసుకున్నారు. సోమవారం నుంచి బస్సు సర్వీసులను పునరుద్ధరించారు. 

చదవండి: మమ్మల్ని ఏపీకి బదిలీ చేయండి 

పొంచి ఉన్న ‘మహా’ ముప్పు.. 
తెలంగాణ–మహారాష్ట్రాల మధ్య అంతర్రాష్ట్ర సర్వీసులను పునరుద్ధరించడం ఆందోళన కలిగిస్తోంది. జిల్లాలోని బోధన్‌ రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని కోటగిరి, బోధన్, రెంజల్‌ మండలంలోని అనేక గ్రామాలు మహారాష్ట్ర ప్రాంత సరిహద్దులకు ఆనుకుని ఉన్నాయి. బోధన్‌ మండలంలోని సాలూర గ్రామం నుంచి 80 కిలో మీటర్ల దూరంలో గల మహారాష్ట్ర ప్రాంతంలోని నాందేడ్‌ జిల్లా కేంద్రం ఉండగా, ఇదే జిల్లా పరిధిలోని బిలోలి, దెగ్లూర్, కొండల్‌వాడీ, ధర్మాబాద్‌ పట్టణ కేంద్రాలు, అనేక పల్లెలు తెలంగాణ ప్రాంత సరిహద్దు పల్లెలకు ఆనుకుని ఉన్నాయి. రెండు రాష్ట్రాల సరిహద్దు పట్టణ కేంద్రాలు, పల్లెల నుంచి రాకపోకాలు సాగుతున్నాయి. గతంలో నిత్యం 10–12 బస్సు సర్వీసులు నడిపే వారు. కరోనా కారణంగా వాటిని నిలిపి వేయగా, తాజాగా సోమవారం నుంచి ఐదు సర్వీసులను నడుపుతున్నారు. ప్రస్తుతానికి నాందేడ్, దెగ్లూర్‌ పట్టణాలకు బస్సులు నడుస్తున్నాయి. కార్లు, ప్యాసింజర్‌ ఆటోలు ఎప్పటి నుంచో తిరుగుతున్నాయి. 

నిత్యం పదుల సంఖ్యలో కేసులు.. 
మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న సాలూర వద్ద చెక్‌ పాయింట్‌ ఏర్పాటు చేసి పొరుగు రాష్ట్రం నుంచి వస్తున్న ప్రయాణికులకు టెస్టులు చేస్తున్నారు. ఇక్క డ నిత్యం పదుల సంఖ్యలో పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. రోజు రోజుకు పెరుగుతున్న కరోనా కేసులు సరిహద్దు ప్రాంత ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. మహారాష్ట్ర ప్రాంతానికి సరిహద్దులో గల సాలూర క్యాంప్‌ గ్రామంలో పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో ఆ గ్రామస్తులు స్వచ్ఛందంగా లాక్‌డౌన్‌ ప్రకటించారు. 

ఐదు సర్వీసుల పునరుద్ధరణ.. 
కరోనా నేపథ్యంలో మార్చి 24 నుంచి మహారాష్ట్ర ప్రాంతానికి బస్సు సర్వీసులు నిలిపివేశాం. అయి తే, సోమవారం నుంచి నాందేడ్, దెగ్లూర్‌లకు ఐదు బస్సు సర్వీసులు పునరుద్ధరించాం. కరోనా నిబంధనలు పాటిస్తూ బస్సులు నడుపుతున్నాం. సిట్టింగ్‌ సీట్ల మేరకే ప్రయాణికులకు అనుమతి ఇస్తున్నాం. 
– రమణ, బోధన్‌ డిపో మేనేజర్‌

మరిన్ని వార్తలు