Double Decker Buses In Hyderabad: మనకూ ఎలక్ట్రిక్‌ డబుల్‌ డెక్కర్‌లు

20 Aug, 2022 01:36 IST|Sakshi

20–25 బస్సులు కొనాలని ఆర్టీసీ నిర్ణయం

3 కంపెనీలతో చర్చలు జరుపుతున్న యాజమాన్యం

ధరపై స్పష్టత రాగానే ఆర్డర్‌  

సాక్షి, హైదరాబాద్‌: భాగ్యనగర రోడ్లపై ఎలక్ట్రిక్‌ డబుల్‌ డెక్కర్‌ బస్సులను నడిపేందుకు టీఎస్‌ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తోంది. దేశంలోనే తొలిసారి ముంబైలో ఎలక్ట్రిక్‌ డబుల్‌ డెక్కర్‌లు గురువారం రోడ్డెక్కిన నేప థ్యంలో వాటిని రూపొందించిన అశోక్‌ లేలాండ్‌ అను బంధ సంస్థ స్విచ్‌ మొబిలిటీతోపాటు మరో 2 కంపె నీలతో ఆర్టీసీ యాజమాన్యం చర్చలు జరుపుతోంది. ఇందులో ఓ కంపెనీతో చర్చలు దాదాపు కొలిక్కి వస్తు న్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. హైదరాబాద్‌లో 20–25 ఎలక్ట్రిక్‌ డబుల్‌ డెక్కర్‌ బస్సులు తిప్పాలని నిర్ణయించిన ఆర్టీసీ... ధర విషయంలో స్పష్టత రాగానే ఆర్డర్‌ ఇవ్వనున్నట్లు సమాచారం.

గతంలోనే టెండర్లు: హైదరాబాద్‌లో డబుల్‌ డెక్కర్‌ బస్సులను పునః­ప్రారంభించే విషయమై మంత్రి కేటీఆర్‌ చేసిన సూచ­నకు రవాణాశాఖ మంత్రి పువ్వా­డ అజయ్‌కుమార్‌ సానుకూలంగా స్పందించడంతో కొత్త డబుల్‌ డెక్కర్‌ బస్సులు కొనాలని గతేడాది నిర్ణయించారు. ఈ మేరకు టెండర్లు కూడా పిలిచారు. కానీ కొత్త బస్సులు కొనేందుకు నిధుల్లేకపోవడంతో ఆర్టీసీ చేతులెత్తేసింది.అయితే ఇది కేటీఆర్‌ ప్రతిపాదన కావడంతో పురపాలక శాఖ ఆర్థిక సాయం చేస్తుందన్న అంశం తెరపైకి వచ్చినా అది సాకారం కాలేదు.

ఆర్టీసీకి భారమే..:ముంబైలో ఎలక్ట్రిక్‌ డబుల్‌ డెక్కర్‌ బస్సు ధర రూ.2 కోట్లు. రాష్ట్ర ప్రభుత్వ సాయం లేకుం­డా ఇంత భారీ మొత్తాన్ని ఖర్చు చేయడం ఆర్టీసీకి తలకుమించిన భా­రమే. మరోవైపు డబుల్‌ డెక్కర్‌ బస్సుపై రెండు షిఫ్టు­ల్లో కలిపి ఆరుగురు సిబ్బంది పని చేయాలి. గతంలో డబుల్‌ డెక్కర్‌ బస్సులతో తీవ్ర నష్టాలు రావడం వల్లే వాటిని తప్పించారు.

ఇప్పుడు కూడా వాటితో నష్టా­లు తప్పవన్నదే ఆర్టీసీ నివేదిక చెబుతోంది. ఈ నేప­థ్యంలో ప్రభుత్వ సాయంకోసం ఆర్టీసీ యత్నిస్తోంది. మరోవైపు నగరంలోని చాలా మార్గాల్లో ఫ్లైఓవర్లు ఉన్నందున డబుల్‌ డెక్కర్‌ బస్సులను తిప్పడం కూడా ఇబ్బంది కానుంది. ఈ నేపథ్యంలో త్వరలో ఓ అధికా­రు­ల బృందం ముంబై వెళ్లి అక్కడ ఫ్లైఓవర్ల సమస్యను అధిగమించి డబుల్‌ డెక్కర్‌ బస్సులను ఎలా తిప్పుతున్నారో అధ్యయనం చేయనున్నట్లు తెలిసింది. 

మరిన్ని వార్తలు