TSRTC Bus Fares Hike: తెలంగాణలో మరోసారి ఆర్టీసీ చార్జీల పెంపు!

1 Dec, 2021 13:04 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌:తెలంగాణలో మారోసారి ఆర్టీసీ ఛార్జీల పెంపునకు రంగం సిద్ధమైంది. ఎప్పటి నుంచో టీఎస్‌ఆర్టీసీ ఛార్జీల పెంపుపై సాగుతున్న చర్చ తాజాగా ఇది కొలక్కి వచ్చింది. ఓ వైపు కరోనా.. మరోమైపు  డీజిల్‌ ధరలు పెరగడంతో బస్సు చార్జీలు పెంచక తప్పదనే నిర్ణయానికి టీఎస్‌ఆర్టీసీ వచ్చింది. ఇప్పటికే ఆర్టీసీ చార్జీల పెంపునకు సంబంధించిన ఫైల్‌ సీఎం కేసీఆర్‌ ముందుకు చేరింది. చార్జీల పెంపును ఆమోదించాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దీంతో ఆర్టీసీ చార్జీల పెంపుపై సీఎం కేసీఆర్‌ అతి త్వరలోనే అధికారిక నిర్ణయం తీసుకోనున్నారు.

కాగా ఆర్డినరీ బస్సులో కిలోమీటర్‌కు 20 పైసల పెంపు, పల్లె వెలుగు బస్సుల్లో 25 పైసల పెంపు, అన్నీ ఇతర బస్సుల్లో 30 పైసల చొప్పున చార్జీలు పెంచాలని సజ్జనార్‌ ప్రతిపాదించారు. ఆ సందర్భంగా సజ్జనార్‌ మాట్లాడుతూ.. అప్పుల్లో కూరుకుపోయిన ప్రజారవాణా సంస్థ టీఎస్ఆర్టీసీపై డీజిల్ రూపంలో మరో పెనుభారం పడిందన్నారు. రోజురోజుకీ పెరిగిపోతున్న డీజిల్ ధరలతో ఆర్టీసీ రోజూ కోట్లలో నష్టం చవిచూస్తోందని తెలిపారు. దీంతో చార్జీలు పెంచక తప్పని అనివార్య పరిస్థితులు నెలకొన్నాయని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ వ్యాఖ్యానించారు. 
చదవండి: ఆర్టీసీ బస్సులో సజ్జనార్‌ కుటుంబం.. వీడియో వైరల్‌

9750 ఆర్టీసీ  బస్సులను 3080 రూట్లలో నడిపిస్తున్నట్లు వీసీ సజ్జనార్ పేర్కొన్నారు. రోజూ 33 లక్షల కిలోమీటర్లు బస్సులు తిరుగుతూ 32 లక్షల మంది ప్రయాణికులను ప్రతి రోజు తరలిస్తున్నామని తెలిపారు. గతంలో అన్ని బస్సులకు 20 పైసలు పెంచడం జరిగిందని, ఆ డబ్బులు ఆర్టీసీకి చేరలేదన్నారు. కరోనా వచ్చినప్పటి నుంచి ఆర్టీసీ తీవ్ర నష్టాలు ఎదుర్కొంటుందన్నారు.కరోనా సమయంలో బస్సులు నడపడం వల్ల 251 మంది మరణించారన్నారు. రెండు సంవత్సరాలుగా డీజిల్ ధరలు భారీగా పెరిగుతున్నాయని, రూ. 63.8  డీజిల్ ఇప్పుడు 87.రూపాయలు ఉందన్నారు. స్పెర్ పార్ట్స్‌ కూడా భారీగా పెరిగాయని తెలిపారు.

ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు 1440 కోట్ల నష్టం వచ్చిందని, అందుకే చార్జీలు పెంచాలని ప్రభుత్వానికి గతంలో విజ్ఞప్తి చేశామని సజ్జనార్‌ గుర్తు చేశారు. ఇప్పుడు కూడా మంత్రి పువ్వాడ ద్వారా కోరుతున్నామన్నారు. ఛార్జీలు పెరగం వల్ల ఆర్టీసీ మళ్లీ సాధారణ స్థితికి వస్తుందన్నారు.  అన్ని ధరలు పెరిగాయని, ఆర్టీసీ ఛార్జీలు కూడా పెంచాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఛార్జీల పెంపుతో సుమారు రూ. 800 కోట్ల నుంచి రూ.850 కోట్ల వరకు అదనపు ఆదాయం లభించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అదే విధంగా ఆర్టీసీ నష్టాల్లో ఉందని, చార్జీలు పెంచక తప్పడం లేదని రవాణాశాఖ మంత్రి పువ్వాడ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు