ఆర్టీసీ ఉద్యోగులకు దసరా బోనస్‌ లేనట్టే!

13 Oct, 2020 19:35 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కరోనాతో ఆర్థికంగా నష్టాల్లో ఉన్న టీఎస్‌ఆర్టీసీ తమ ఉద్యోగులకు కొన్ని నెలలుగా జీతాలు సరిగా చెల్లించడం లేదు. అయితే దసరా పండుగను పురస్కరించుకొని ఉద్యోగులకు బోనస్‌ ఇవ్వడం ఆనవాయితీగా వస్తున్న విషయం తెలిసిందే.  కానీ ఈసారి కరోనా పరిస్థితుల వల్ల ఉద్యోగులకు బోనస్‌ చెల్లించే అవకాశం లేనట్టే కనిపిస్తోంది. ఈ సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ స్టాప్‌ అండ్‌ ఫెడరేషన్‌ దసరా పండుగను సంతోషంగా జరుపుకునేందుకు ఆర్టీసీ కార్మికులకు బోనస్‌ను చెల్లించాల్సిందిగా ఆర్టీసీ యాజమాన్యాన్ని విజ్ఞప్తి చేసింది.

'ప్రతి దసరా పండుగకు ఆర్టీసీ కార్మికులకు ఆనవాయితీగా ఇస్తున్నా పండుగ అడ్వాన్స్ ఇచ్చి ఆర్టీసీ కార్మికులను సంతోషంగా పండుగ జరుపుకునే వీలు కల్పించాలి. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు హిందువులకు దసరా, క్రిష్టియన్లకు క్రిస్మస్, ముస్లింలకు రంజాన్ పండగల వేల అడ్వాన్స్ పండగ నెల జీతాలతో కలిపి అడ్వాన్స్ చెల్లించేవారు. ఈసారి పండుగ అడ్వాన్స్ ఇవ్వకపోవడం సరైంది కాదు. ఒక్కో కార్మికుడికి ఇచ్చే 4500 రూపాయలను పది నెలల కాలంలో తిరిగి యాజమాన్యం కార్మికుల జీతం నుంచి రికవరీ చేస్తుంది. ఇందుకోసం ట్రెజరీ నుంచి రూ. 25 కోట్ల ఖర్చు మాత్రమే అవుతుంది. ఈసారి జీతంతో పాటు అడ్వాన్సు ఎందుకు చెల్లించలేదో సమాచారం ఇవ్వలేదు. కనీసం సద్దుల బతుకమ్మ పండగ రోజు కైనా కార్మికులకు  అడ్వాన్స్ చెల్లించేలా చూడాలని ఆర్టీసీ యాజమాన్యాన్ని కోరుతున్నట్లుగా' పేర్కొన్నారు. 


 

మరిన్ని వార్తలు