శిక్షణ తేదీని ప్రకటించకుంటే చనిపోతాం! 

20 Aug, 2020 07:01 IST|Sakshi

ఉద్రిక్తంగా టీఎస్‌ఎస్పీ కేడెట్ల డీజీపీ కార్యాలయ ముట్టడి 

దాదాపు 2 వేల మంది వరకు వచ్చిన అభ్యర్థులు 

సాక్షి, హైదరాబాద్‌: తమకు వెంటనే శిక్షణ తేదీని ప్రకటించాలంటూ తెలంగాణ స్టేట్‌ స్పెషల్‌ పోలీస్‌ (టీఎస్‌ఎస్పీ) కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఎన్నికైన అభ్యర్థులు చేపట్టిన డీజీపీ కార్యాలయ ముట్టడి ఉద్రిక్తంగా మారింది. ‘శిక్షణ తేదీని వెంటనే ప్రకటిం చండి. లేదా కారుణ్య మరణాలకు అనుమతించండి’ అంటూ బుధవారం చలో డీజీపీ కార్యాలయం పేరిట ముట్టడికి పిలుపునిచ్చా రు. బుధవారం ఉదయం 10 గంటలకల్లా రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి దాదాపు 2వేల మంది కేడెట్లు లక్డీకాపూల్‌కు చేరుకున్నారు. ఈ క్రమంలో వచ్చిన వారిని వచ్చినట్లుగా పోలీసులు వారిని వ్యాన్లలోకి ఎక్కించారు. దీంతో తోపులాట, వాగ్వాదం చెలరేగింది. అరెస్టు చేసిన కేడెట్లందరినీ ముషీరాబాద్, గోషామహల్‌ తదితర ఠాణాలకు తరలించి, సాయంత్రం వదిలిపెట్టారు. 

కారుణ్యమరణానికి హెచ్చార్సీకి వినతి! 
తమ శిక్షణ తేదీని ఇంకా ప్రకటించకపోవడం తో ఆర్థికంగా, సామాజికంగా అనేక ఇబ్బం దులు పడుతున్నామని, వేతనం, సర్వీసు కోల్పోతున్నామని పలువురు అభ్యర్థులు రాష్ట్ర మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించారు. తాము గతేడాది సెప్టెంబర్‌లోనే టీఎస్‌ఎస్పీ కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఎంపికయ్యామని, తమతోపాటు సెలక్టయిన సివిల్, ఏఆర్‌లకు శిక్షణ కూడా పూర్తికావొచ్చిందని వాపోయా రు. శిక్షణ తేదీల కోసం ఎదురుచూసి విసిగిపోయామని, ఇక తమకు కారుణ్య మరణాని కి అనుమతివ్వాలని విన్నవించారు. ఈలోగా డీజీపీ కార్యాలయం నుంచి అభ్యర్థులకు పిలుపు వచ్చింది. నలుగురు ప్రతినిధుల బృందంతో లా అండ్‌ ఆర్డర్‌ ఏడీజీ జితేందర్‌ మాట్లాడారు. ప్రస్తుతమున్న బ్యాచ్‌ల శిక్షణ పూర్తికాగానే అక్టోబర్‌ చివరి లేదా నవంబర్‌ మొదటివారంలో శిక్షణ ప్రారంభిస్తామని చెప్పడంతో కేడెట్లు శాంతించారు. 

మరిన్ని వార్తలు