టీఎస్‌ ఎస్పీడీసీఎల్‌లో 1,661 పోస్టులు

17 Feb, 2023 00:50 IST|Sakshi

ఏఈ (ఎలక్ట్రికల్‌) పోస్టులు 48.. జేఎల్‌ఎం పోస్టులు 1,553 భర్తీ 

ఈ నెల 23 నుంచి ఏఈ పోస్టులకు, వచ్చే నెల 8 నుంచి జేఎల్‌ఎం పోస్టులకు దరఖాస్తులు 

రెండింటికీ ఏప్రిల్‌ 24 నుంచి హాల్‌టికెట్లు.. 30న రాతపరీక్ష 

సాక్షి, హైదరాబాద్‌: దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ (టీఎస్‌ఎస్పీడీసీఎల్‌) పరిధిలో 48 అసిస్టెంట్‌ ఇంజనీర్‌ (ఎలక్ట్రికల్‌), 1,553 జూనియర్‌ లైన్‌మన్‌ పోస్టుల భర్తీకి గురువారం సమగ్ర నియామక ప్రకటనలు జారీ అయ్యాయి. ఏఈ పోస్టులకు ఈ నెల 23 నుంచి వచ్చే నెల 15వరకు.. జేఎల్‌ఎం పోస్టులకు వచ్చే నెల 8 నుంచి 28 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించనున్నారు.

రెండు పరీక్షలకు కూడా ఏప్రిల్‌ 24 నుంచి ఆన్‌లైన్‌లో హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఏప్రిల్‌ 30న రాతపరీక్ష నిర్వహించనున్నారు. గరిష్ట వయోపరిమితి జేఎల్‌ఎం పోస్టులకు 35 ఏళ్లు, ఏఈ పోస్టులకు 44 ఏళ్లు. ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌ లేదా ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానికల్‌ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్‌ డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హతలు కలిగిన వారు ఏఈ (ఎలక్ట్రికల్‌) పోస్టులకు అర్హులు. జూనియర్‌ లైన్‌మన్‌ పోస్టులకు పదో తరగతితోపాటు ఎలక్ట్రికల్‌/వైర్‌మన్‌ ట్రేడ్లలో ఐటీఐ లేదా ఎలక్ట్రికల్‌ ట్రేడ్‌లో ఇంటర్‌ వొకేషనల్‌ కోర్సు చేసి ఉండాలి. పూర్తి వివరాలకు సంస్థ వెబ్‌సైట్‌ (https://tssouthernpower.cgg.gov.in) ను సందర్శించవచ్చని టీఎస్‌ ఎస్పీడీసీఎల్‌ ప్రకటించింది.    

మరిన్ని వార్తలు