ఓటుకు కోట్లు: కళ్లకు కట్టినట్లు చెప్పిన మార్కం టేలర్‌ 

4 May, 2021 02:17 IST|Sakshi

మాట్లాడించింది టీడీపీ క్రిస్టియన్‌ సెల్‌ నేత సెబాస్టియన్‌ 

ఓటుకు కోట్లు కుట్రను కళ్లకు కట్టినట్లు చెప్పిన మార్కం టేలర్‌ 

సాక్షి, హైదరాబాద్‌: ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటు వేస్తే మన వాళ్లు చేసిన వాగ్దానాన్ని నెరవేరుస్తానని చంద్రబాబు నాయుడు తనకు హామీ ఇచ్చారని నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌ ఏసీబీ ప్రత్యేక కోర్టుకు నివేదించారు. టీడీపీ క్రిస్టియన్‌ సెల్‌ నేత హ్యారీ సెబాస్టియన్‌ ఫోన్‌లో చంద్రబాబుతో మాట్లాడించారని స్పష్టం చేశారు. టీడీపీ అభ్యర్థికి ఓటు వేయాలని ‘‘మన వాళ్లు అంతా బ్రీఫ్‌ మీ’’వాళ్లు ఇచ్చిన హామీ నెరవేరుస్తా అంటూ.. చంద్రబాబు తనను ప్రలోభపెట్టారని వివరించారు. ఓటుకు కోట్లు కేసు విచారణలో భాగంగా సోమవారం స్టీఫెన్‌సన్‌ వాంగ్మూలాన్ని ఏసీబీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి సాంబశివరావు నాయుడు నమోదు చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఫోన్‌లో మాట్లాడిన ఆడియోను కోర్టులో ప్లే చేయగా విని స్టీఫెన్‌సన్‌ ధ్రువీకరించారు. అలాగే రూ.50 లక్షలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రికార్డు చేసిన వీడియో, ఆడియో దృశ్యాలను కూడా చూసి ధ్రువీకరించారు. లంచం ఇచ్చేందుకు వచ్చిన సమయంలో రేవంత్‌రెడ్డి, సెబాస్టియన్, రుద్ర ఉదయ సింహలు ఉన్నారంటూ వారిని కోర్టు హాల్లో (ఐడెంటిఫికేషన్‌ సందర్భంగా) గుర్తించారు. 

మా ఇంట్లోనే కలిశారు.. 
‘‘స్టీఫెన్‌సన్‌ను ఆయన ఇంట్లో కలవడానికి టీడీపీ నేతలు సిద్ధపడకపోవడంతో మా ఇంట్లో కలిసేందుకు ఏర్పాటు చేశాం. ఆ రోజు డబ్బు ఇచ్చేందుకు రేవంత్‌రెడ్డి తదితరులు మా ఇంటికి వచ్చారు. రేవంత్‌రెడ్డి సూచన మేరకు రూ.50 లక్షలు బ్యాగ్‌ నుంచి తీసి రుద్ర ఉదయ సింహ టేబుల్‌ మీద పెట్టారు. ఓటింగ్‌ తర్వాత రూ.4.5 కోట్లు ఇస్తామని చెప్పారు. ఈ ఘటన మొత్తం వీడియోలో రికార్డయింది. డబ్బు ఇచ్చేందుకు వచ్చింది రేవంత్‌రెడ్డి, సెబాస్టియన్, రుద్ర ఉదయ సింహలే’’అని మరో ప్రత్యక్ష సాక్షి మార్కం టేలర్‌ ఓటుకు కోట్లు కుట్రను కళ్లకు కట్టినట్లు వివరించారు. లంచం ఇస్తున్న సమయంలో ప్రత్యక్షంగా చూసిన మరో ప్రత్యక్ష సాక్షి మార్కం టేలర్‌ కుమార్తెను హాజరై వాంగ్మూలం ఇవ్వాలని ఆదేశిస్తూ కోర్టు సమన్లు జారీచేసింది. తదుపరి విచారణను ఈనెల 7కు వాయిదా వేసింది.   

మరిన్ని వార్తలు