నందుకు బిగుస్తున్న ఉచ్చు.. తెరపైకి హీరో రానా ప్లాట్‌ వ్యవహారం

17 Nov, 2022 07:41 IST|Sakshi

బంజారాహిల్స్‌: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితుడు నందుకుమార్‌పై బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో మరో మూడు చీటింగ్‌ కేసులు నమోదయ్యాయి. ఫిలింనగర్‌ రోడ్‌ నం.1 లోని ప్లాట్‌ నం. 2లో సినీ హీరో దగ్గుబాటి రానా ప్లాట్‌ను నందు లీజుకు తీసుకొని జీహెచ్‌ఎంసీ అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మాణాలు చేపట్టి అద్దెకిచ్చాడు. 

అయితే, చట్టపరమైన హక్కులు లేకుండా ఈ ప్లాట్‌లో నిర్మించిన అక్రమ కట్టడాలను అధికారులు గత ఆదివారం కూల్చివేశారు. ఇక్కడ ఐస్‌క్రీం పార్లర్‌ ఏర్పాటు కోసం రూ.8 లక్షలు అడ్వాన్స్‌గా చెల్లించానని, రూ.40 లక్షలతో మరమ్మతులు, ఇంటీరియర్‌ చేయించుకున్నానని, ఇప్పుడు ఈ కట్టడాన్ని అధికారులు కూల్చివేశారని, డబ్బులు వసూలు చేసి మోసగించిన నందుపై చర్యలు తీసుకోవాలని సంజయ్‌రెడ్డి పోలీసులకు ఫిర్యాదుచేశా రు. అలాగే బాంబే గార్మెంట్‌ స్టోర్‌ పేరుతో తనకు ఓ అక్రమ కట్టడాన్ని అంటగట్టి పెద్ద ఎత్తున అడ్వాన్స్‌ తీసుకున్నాడని ఇంటీ రియర్‌ కోసం తాను లక్షలాది రూపాయలు ఖర్చు చేశానని మియాపూర్‌కు చెందిన ఇందిర పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ ప్లాట్‌లో అక్రమంగా నిర్మించిన ఓ షాపును బరిస్టా స్టోర్‌ పేరుతో తాను ఏర్పాటు చేశానని.. ఇది అక్రమ నిర్మాణం కావడంతో అధికారులు కూల్చివేతకు యత్నించడమే కాకుండా నోటీసులు జారీ చేశారని తనను మోసగించిన నందుపై చర్యలు తీసుకోవాలంటూ బంజారాహిల్స్‌కు చెందిన అశిజ్‌రెడ్డి ఫిర్యాదు చేశా రు. వీరి ఫిర్యాదు మేరకు పోలీసులు నందుపై ఐపీసీ సెక్షన్‌ 406, 420, 506 కింద కేసులు నమో దుచేశారు. ఇదిలా ఉండగా ఆరు రోజుల క్రితం దక్కన్‌ కిచెన్‌ హోటల్స్‌ యజమాని సయ్యద్‌ అయాజ్, మొబైల్‌ యాక్ససెరీస్‌ గాడ్జెట్‌ స్టూడియో యజమాని సందీప్‌ కుమార్‌ కూడా బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో మొత్తంగా నందుపై పోలీసులు అయిదు చీటింగ్‌ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు