మలక్‌పేట ఏరియా ఆసుపత్రిలో బాలింతల మృతి.. బంధువుల కన్నెర్ర

13 Jan, 2023 12:54 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌లో విషాదం చోటుచేసుకుంది. మలక్‌పేట ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం వెలుగుచూసింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరు బాలింతలు మృతి చెందడం  కలకలం రేపుతోంది. బాధిత బంధువుల ఆందోళనతో అస్పత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది.

నాగర్‌ కర్నూల్‌ జిల్లా చెదురుపల్లి గ్రామానికి చెందిన సిరివెన్నెల రెండో కాన్పు కోసం మలక్‌పేట ఏరియా ఆసుపత్రిలో చేరారు. అయితే వైద్య పరీక్షలు నిర్వహించకుండానే ఆపరేషన్‌ చేశారని బంధువులు ఆరోపిస్తున్నారు. ఆమె డెంగ్యూ జ్వరం ఉన్నది గుర్తించకుండా డెలీవరీ చేయడంతో తీవ్ర రక్తస్రావం జరిగిందని తెలిపారు. వెంటనే బాలింతను గాంధీ ఆసుపత్రికి తరలించగా అప్పటికే ప్లేట్‌లేట్స్‌ తగ్గిపోవడంతో చికిత్స పొందుతూ ఆమె మృతిచెందింది. ముందస్తు వైద్య పరీక్షలు చేయకుండా ఆమె మరణించినట్లు గాంధీ వైద్యులు తెలిపారు.

ఇదే క్రమంలో మరో బాలింత శివాని సైతం డెలివరీ అనంతరం అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోయింది. దీంతో వైద్యుల నిర్లక్ష్యానికి ఇద్దరు బాలింతలు బలయ్యారని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వైద్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మలక్‌పేట ఆసుపత్రి ఎదుట, చాదర్‌ఘట్‌ పోలీస్‌ స్టేషన్‌ ఎదుట ఆందోళన చేపట్టారు. మృతికి కారణమైన డాక్టర్లను సస్పెండ్‌ చేయాలంటూ డిమాండ్‌ చేశారు. న్యాయం జరిగే వరకుకదిలే ప్రస్తకే లేదని వెల్లడించారు. 

వైద్యాధికారులు ఏమన్నారంటే..
మలక్‌పేట ఆసుపత్రిలో  బాలింతల మృతిపై వైద్యుల నిర్లక్ష్యం లేదని వైద్యాధికారి సునీత వెల్లడించారు. సిరివెన్నెలకు డెంగ్యూ ఫీవర్‌ లేదని తెలిపారు. డెంగ్యూ ఉంటే తాము డెలివరీ చేయమని పేర్కొన్నారు. అన్ని పరీక్షలు చేశాకే డెలివరీ చేశమన్నారు. డెలివరీ తర్వాత సిరివెన్నెలకు హార్ట్‌రేట్‌ పెరిగిందని, హార్ట్‌ ప్రాబ్లమ్‌ రావడంతో గాంధీకి తరలించామన్నారు. శివానికి హైపోథైరాయిడ్‌ సమస్య ఉందన్నారు.
చదవండి: పండుగ ప్రయాణం.. నరకయాతన

మరిన్ని వార్తలు