డీడీలు కట్టినా.. గొర్రెలు రాలే! 

4 Aug, 2020 08:52 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఉచిత గొర్రెల పంపిణీ పథకం కింద ఎంపికైన లబ్ధిదారులకు రెండేళ్లుగా నిరీక్షణ తప్పడం లేదు. అప్పు చేసి  డీడీలు కట్టినా ఇంకా గొర్రెలను ఇవ్వలేదని 28 వేల మం ది గొర్రెల పెంపకందారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

3.70 లక్షల మందికి పంపిణీ.. 
వాస్తవానికి రాష్ట్రంలో గొర్రెల ఉత్పత్తిని పెంచడం ద్వారా పెంపకందారుల జీవన ప్రమాణాలను మెరుగుపర్చాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం 2017లో ఉచిత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించింది. అందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 7.25 లక్షల మంది లబ్ధిదారులను ఎంపిక చేసింది. తొలి విడతలో భాగంగా 3.70 లక్షల మందిని లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేసి దాదాపు రూ.3,700 కోట్ల వ్యయంతో 2017 జూన్‌ నుంచి 2018 ఏప్రిల్‌ వరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. అయితే దీని కింద 20+1 గొర్రెలను ఒక యూనిట్‌గా నిర్ణయించింది. ఒక్కో యూనిట్‌ ధర రూ.1.25 లక్షలుగా నిర్ణయించి అందులో 25 శాతం అంటే రూ.31,250 లబ్ధిదారుల వాటాగా తీసుకుని మిగిలిన రూ.93,750 ప్రభుత్వమే భరించింది.

లబ్ధిదారులు తమ వాటా మొత్తాన్ని ప్రభుత్వానికి డీడీల రూపంలో చెల్లించారు. ముందస్తు అసెంబ్లీతోపాటు వరుస ఎన్నికల కోడ్, నిధుల లేమి పేరుతో ఇప్పటివరకు  గొర్రెలను  పంపిణీ చేయలేదు. 28 వేల మందికి గొర్రెల పంపిణీకి దాదాపు రూ.300 కోట్లు ఖర్చవుతాయని, ఈ మేరకు నిధులు కూడా గొర్రెలు, మేకల పెంపకందారుల సమాఖ్య, జిల్లా కలెక్టర్ల అకౌంట్లలో ఉన్నాయని తెలంగాణ గొర్రెలు, మేకల పెంపకం దారుల సంఘం ప్రధానకార్యదర్శి ఉడుత రవీందర్‌ అన్నారు.   

మరిన్ని వార్తలు