సెల్ఫీ తీసుకుంటూ.. గోదావరిలో పడి..

4 Oct, 2021 04:03 IST|Sakshi
దేవసి కేతారాం, దేవసి ఈరారం(ఫైల్‌) 

ముగ్గురు యువకుల గల్లంతు 

ఒకరిని కాపాడిన స్థానికులు 

నిజామాబాద్‌ జిల్లా ఉమ్మెడ వద్ద ఘటన 

నందిపేట్‌(ఆర్మూర్‌): సెల్ఫీ తీసుకునేందుకు వెళ్లి ఇద్దరు యువకులు గోదావరి నదిలో గల్లంతయ్యారు. కొట్టుకుపోతున్న మరో యువకుడిని స్థానికులు కాపా డారు. నిజామాబాద్‌ జిల్లా నందిపేట్‌ మండలం ఉమ్మెడ శివారులో ఈ సంఘటన జరిగింది. రాజస్తాన్‌కు చెందిన దేవసి కేతారాం, దేవసి ఈరారాం, దేవసి సుజారాం, మోహన్‌లాల్, మీరారాం, జాంతారాం మూడేళ్లక్రితం నందిపేట్‌కు వలస వచ్చారు. ఇక్కడ వివిధ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు.

ఆదివారం ఉమ్మెడ గ్రామ శివారులోని గోదావరి నదీతీరంలో సరదాగా గడిపేందుకు ఈ ఆరుగురు కలసి వెళ్లారు. ఈ సందర్భంగా ఉమామహేశ్వర ఆలయ సమీపంలో నది ఒడ్డు వద్ద కేతారాం, ఈరారాం, జాంతారాం సెల్ఫీ తీసుకునేందుకు వెళ్లారు. ప్రమాదవశాత్తు ముగ్గురూ నదిలో పడిపోయారు. వరద తీవ్రత ఎక్కువగా ఉండడంతో వీరు నదిలో కొట్టుకుపోయారు. దీంతో ఒడ్డున ఉన్న మిగతా ముగ్గురు సాయం కోసం కేకలు వేశారు.

అదే సమయంలో అటుగా వెళ్తున్న ఉమ్మెడకు చెందిన రామడ బుచ్చన్న, బుచ్చ శేఖర్‌ వీరి అరుపులువిని అక్కడికి చేరుకున్నారు. నదిలో కొట్టుకుపోతున్న జాంతారాం ను ఒడ్డుకు చేర్చారు. మిగతా ఇద్దరిని కాపాడే ప్రయ త్నం చేసినా  ప్రవాహం దాటికి వారు గల్లంతయ్యారు. పోలీసులకు సమాచారం ఇవ్వడం తో ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం లేకపోయింది. గల్లంతయిన ఈరారాం నందిపేటలోని ఓ ఎలక్ట్రికల్‌ షాప్‌లో పని చేస్తున్నాడు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. కిరాణ దుకాణంలో పని చేసే కేతారాం అవివాహితుడు. 

యువకులు గల్లంతయింది ఈ ప్రాంతంలోనే..  

మరిన్ని వార్తలు