61 వేల కేసుల పరిష్కారం

11 Jul, 2021 00:50 IST|Sakshi
పరిహారం చెక్కును అందిస్తున్న న్యాయమూర్తి సుమలత

రాష్ట్ర వ్యాప్త లోక్‌అదాలత్‌కు అనూహ్య స్పందన 

సాక్షి, హైదరాబాద్‌: సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కోర్టుల్లో నిర్వహించిన లోక్‌అదాలత్‌కు అనూహ్య స్పందన లభించింది. వివిధ కోర్టుల్లో పెండింగ్‌లో దాదాపు 61 వేల కేసులను పరిష్కరించారు. ఇందులో 1,400 సివిల్, 52,420 వేల క్రిమినల్, విచారణ దశలో ఉన్న 7,180 కేసులను పరిష్కరించి బాధితులకు రూ.60.52 కోట్లు పరిహారంగా అందించారు. హైకోర్టు లీగల్‌ సర్వీస్‌ అథారిటీ ఆధ్వర్యంలో న్యాయమూర్తులు జస్టిస్‌ పి.నవీన్‌రావు, జస్టిస్‌ జి.శ్రీదేవి, జస్టిస్‌ అభిషేక్‌రెడ్డి నిర్వహించిన లోక్‌అదాలత్‌లో 203 కేసులు పరిష్కరించినట్లు అథారిటీ కార్యదర్శి రమేష్‌బాబు తెలిపారు.

అలాగే సిటీ సివిల్‌ కోర్టులో నిర్వహించిన లోక్‌అదాలత్‌లో 634 కేసులను పరిష్కరించి బాధితులకు రూ.19.66 కోట్లు పరిహారంగా అందించినట్లు అథారిటీ చైర్మన్, చీఫ్‌ జడ్జి సుమలత, కార్యదర్శి మురళీమోహన్‌ తెలిపారు. సికింద్రాబాద్‌ లీగల్‌ సర్వీస్‌ అథారిటీ ఆధ్వర్యంలో 120 కేసులను పరిష్కరించి రూ.5.90 కోట్లు పరిహారంగా అందించారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమాకోహ్లీ, లీగల్‌ సర్వీస్‌ అథారిటీ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ జస్టిస్‌ ఎంఎస్‌ రామచందర్‌రావు పర్యవేక్షణలో ఈ అదాలత్‌ నిర్వహించినట్లు లీగల్‌ సర్వీస్‌ అథారిటీ సభ్య కార్యదర్శి జి.అనుపమా చక్రవర్తి శనివారం తెలిపారు.

15 ఏళ్ల తర్వాత మళ్లీ పెళ్లి... 
‘వారిద్దరూ భార్యాభర్తలు. అభిప్రాయ భేదాలు రావడంతో 15 ఏళ్ల కింద న్యాయస్థానాన్ని ఆశ్రయించి విడాకులు పొందారు. కాలక్రమంలో వారి పిల్లలు విదేశాల్లో స్థిరపడ్డారు. ఇప్పుడు వారిద్దరూ మళ్లీ ఒక్కటవ్వాలని భావించారు. మళ్లీ వివాహం చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ విడాకులు మంజూరు చేసిన ఫ్యామిలీ కోర్టులోనే మళ్లీ వారు పిటిషన్‌ వేశారు. వీరిద్దరి మధ్య ఒప్పందం చేశాం. మళ్లీ పెళ్లి చేసుకుని సుఖ సంతోషాలతో జీవించాలని అనుకున్న వారి కోరిక తీరనుంది’అని లీగల్‌ సర్వీస్‌ అథారిటీ కార్యదర్శి మురళీమోహన్‌ తెలిపారు. అలాగే ఐసీఐసీఐ బ్యాంక్‌లో పనిచేసిన శ్రీనిజ సర్టిఫికెట్లు పోగొట్టిన ఘటనలో ఆ బ్యాంకు అధికారులను ఒప్పించి సిటీ సివిల్‌ కోర్టు లీగల్‌ సర్వీస్‌ అథారిటీ రూ.1.15 లక్షల పరిహారాన్ని ఇప్పించింది. 

మరిన్ని వార్తలు