సిబ్బంది అవసరం లేకుండా సబ్‌స్టేషన్ల పర్యవేక్షణ.. టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ ‘హైటెక్‌’ బాట

1 Jan, 2023 08:37 IST|Sakshi

అంతర్గత నిర్వహణ ఖర్చులు, మానవ ప్రమేయాన్ని తగ్గించేందుకే...

జీహెచ్‌ఎంసీలో ఐదు చోట్ల ఆటోమేటెడ్‌ సబ్‌స్టేషన్ల ఏర్పాటుకు నిర్ణయం

కొత్త ఏడాదిలో మరిన్ని ప్రాంతాల్లో నిర్మాణానికి ప్రణాళికలు

శివారు జిల్లాలకు ‘స్కాడా’ సాంకేతికత విస్తరణ కూడా..

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ సహా 15 జిల్లాల పరిధిలో విద్యుత్‌ సేవలు అందిస్తున్న దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ (టీఎస్‌ఎస్పీడీసీఎల్‌) సాంకేతికత వినియోగంలో కొత్త పుంతలు తొక్కుతోంది. ఇప్పటికే మీటర్‌ రీడింగ్, కరెంట్‌ బిల్లుల వసూళ్లు, ఫిర్యాదుల స్వీకరణకు ఆధునిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్న సంస్థ తాజాగా విద్యుత్‌ సరఫరాలోని కీలకమైన సబ్‌స్టేషన్లపై దృష్టి సారించింది. అంతర్గత నిర్వహణ ఖర్చులు, మానవ ప్రమేయాన్ని తగ్గించేందుకు కొత్తగా ఆటోమేటెడ్‌ సబ్‌స్టేషన్లను అందుబాటులోకి తెస్తోంది. ఇప్పటికే గ్రేటర్‌ పరిధిలోని కల్యాణ్‌నగర్, ముఫకంజా, శిల్పారామం, కృష్ణానగర్, నాగోల్‌లలో సబ్‌స్టేషన్ల నిర్మాణ పనులు ప్రారంభించింది. కొత్త ఏడాదిలో మరిన్ని ప్రాంతాల్లోనూ నిర్మించేందుకు ప్రణాళికలు రచిస్తోంది.

ప్రత్యేకత ఏమిటి?
సాధారణంగా ప్రతి సబ్‌స్టేషన్‌లో నాలుగు నుంచి ఆరుగురు విద్యుత్‌ సిబ్బంది పనిచేస్తుంటారు. సబ్‌స్టేషన్‌కు అందుతున్న, మిగతా 2వ పేజీలో u
దాని నుంచి సరఫరా అవుతున్న విద్యుత్‌ తీరును నిరంతరం పర్యవేక్షిస్తుంటారు. ఒకవేళ ఏదైనా ఫీడర్‌ ట్రిప్‌ అయితే వెంటనే సరిచేస్తుంటారు. అయితే ఒక్కో స్టేసన్‌లోని సిబ్బంది జీతాలన్నీ కలిపి రూ. లక్షల్లో ఉండటం, జీహెచ్‌ఎంసీ పరిధిలో వందలాది సబ్‌స్టేషన్లు ఉండటంతో ఈ లెక్కన టీఎస్‌ఎస్పీడీసీఎల్‌పై ప్రతి నెలా రూ. కోట్లలో ఆర్థిక భారం పడుతోంది. ఈ నేపథ్యంలో అందుబాటులోకి తెస్తున్న అన్‌మ్యాన్డ్‌ సబ్‌స్టేషన్లలో సిబ్బంది అవసరం ఉండదు. పూర్తిగా సాఫ్ట్‌వేర్‌ సాయంతో ఇవి పనిచేయనున్నాయి. విద్యుత్‌ సరఫరా రీడింగ్‌ వివరాలను ఎప్పటికప్పుడు ఆటోమేటిక్‌గా నమోదు చేసుకోనున్నాయి. అలాగే ఫీడర్‌ పరిధిలో ఎక్కడ సమస్య వచ్చినా వాటంతట అవే పరిష్కరించనున్నాయి. ప్రతి 10–15 సబ్‌స్టేషన్ల పనితీరును ఒక అసిస్టెంట్‌ ఇంజనీర్‌ పర్యవేక్షిస్తే సరిపోనుంది. దీనివల్ల సంస్థపై ఆర్థికభారంగణనీయంగా తగ్గనుంది.
ఇప్పటికే సాంకేతిక సంస్కరణల బాట...
– విద్యుత్‌ సమస్య తలెత్తినప్పుడు కాల్‌సెంటర్‌ నంబర్‌ 1912 ద్వారా అందే ఫిర్యాదును సంబంధిత సెక్షన్‌ అధికారికి పంపేందుకు ‘సాసా’ యాప్‌ వినియోగం. గతంలో కాల్‌ సెంటర్‌ ద్వారా ఒకే సమయంలో 30 కాల్స్‌ మాత్రమే రిసీవ్‌ చేసుకొనే అవకాశం ఉండగా ప్రస్తుతం ఏకకాలంలో 300 ఫిర్యాదుల స్వీకరణకు అవకాశం.
– 11 కేవీ, 33 కేవీ ఫీడర్లలో విద్యుత్‌ అంతరాయ పనరుద్ధరణకు కంప్యూటర్‌ ఆధారిత అవుటేజ్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టం (ఓఎంఎస్‌) వాడకం. దీని సాయంతో విద్యుత్‌ పునరుద్ధరణకు ఎక్కడికి, ఎందరు సిబ్బందిని పంపాలో ముందే గుర్తించే వీలు.
– సెల్ఫ్‌ మీటర్‌ రీడింగ్‌ యాప్‌ ద్వారా వినియోగదారుడే స్వయంగా ఇంట్లోని మీటర్‌లో నమోదైన రీడింగ్‌ను తీసి బిల్లు పొందే వెసులుబాటు.
– జీహెచ్‌ఎంసీ పరిధిలోని 226 సబ్‌స్టేషన్లు, 167 ఫీడర్లలో రియల్‌టైమ్‌లో విద్యుత్‌ గణాంకాల విశ్లేషణకు సూపర్‌వైజరీ కంట్రోల్‌ అండ్‌ డేటా అక్విజిషన్‌ (స్కాడా) సాంకేతిక వ్యవస్థ అందుబాటులోకి. క్షేత్రస్థాయి నుంచి ఫిర్యాదులు రాకపోయినా ఆటోమేటిక్‌గా సరఫరాను పర్యవేక్షించే వీలు. కరెంట్‌ పోయిన ప్రాంతాల వివరాల గుర్తింపు, క్షేత్రస్థాయి సిబ్బందిని అప్రమత్తం చేయడం ప్రత్యేకత. జీహెచ్‌ఎంసీ పరిధికే పరిమితమైన ఈ సేవలను 2023లో గ్రేటర్‌ శివారు ప్రాంతాలకు, ఆ తర్వాత ఇతర జిల్లాలకు ఈ సేవలను విస్తరించాలని సంస్థ నిర్ణయం.

ఎనిమిదేళ్లలో 34 అవార్డులు..
తెలంగాణ ఏర్పాటుకు ముందు పరిశ్రమలకు పవర్‌ హాలీడేస్‌ ఉండేవి. గృహాలకు తొమ్మిది గంటలు, రైతులకు ఆరు గంటలే విద్యుత్‌ అందేది. ప్రస్తుతం గృహ వినియోగదారులకే కాకుండా వ్యాపారులకు, రైతులకు, పరిశ్రమలకు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేస్తున్నాం. వినియోగదారులకు విద్యుత్‌ సేవలను మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో మార్కెట్లోకి కొత్తగా వచ్చే సాంకేతికతను వినియోగిస్తున్నాం. ఫలితంగా ఈ ఎనిమిదేళ్లలో 34 జాతీయ అవార్డులు డిస్కంకు లభించాయి. ఇది గొప్ప అచీవ్‌మెంట్‌.
– రఘుమారెడ్డి, టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ సీఎండీ
చదవండి: Telangana: గ్రూప్‌–4లో 8,039 పోస్టులే!

మరిన్ని వార్తలు