బాలకృష్ణ అన్‌స్టాపబుల్‌ షోలో చాకిరేవు గ్రామ ప్రస్తావన..

4 Feb, 2023 10:52 IST|Sakshi

ఆదిలాబాద్‌: చాకిరేవు.. నిర్మల్‌ జిల్లా పెంబి మండలంలో ని మారుమూల గ్రామం. ఈ గ్రామం అటవీ ప్రాంతంలో ఉండగా రోడ్డు, కరెంట్, తాగునీటి సౌకర్యం కూడా లేదు. కనీస సౌకర్యాలు కల్పించాలని గతంలో ఈ గ్రామ ఆదివాసీ గిరిజనులు గ్రామం నుంచి నిర్మల్‌ జిల్లా కేంద్రానికి 70కిలో మీటర్లు పాదయాత్ర నిర్వహించి కలెక్టర్‌కు సమస్యలు తెలిపారు. కనీస వసతులు కల్పించేవరకూ కలెకర్‌ కార్యాలయం నుంచి కదలబోమని భీష్మించారు. అక్కడే కూర్చొని దీక్ష చేపట్టారు. 

దీంతో కలెక్టర్‌తో పాటు వివిధ శాఖల అధికారులు మారుమూల చాకిరేవుకు గ్రామానికి పరుగులు తీసి గిరిజనుల సమస్యలు తెలుసుకున్నారు. వెంటనే తాగేందుకు బోర్లు వేయడంతో గ్రామస్తులు దీక్ష విరమించి గ్రామానికి వెళ్లారు. పట్టు వీడకుండా కనీస వసతుల కోసం 70కిలో మీటర్లు నడిచి తాగునీరు తెచ్చుకుని రాష్ట్రంలో హాట్‌టాఫిక్‌గా పెంబి మండల, చాకిరేవు గ్రామం నిలిచింది. దీంతో పాటు హీరో బాలకృష్ణ నిర్వహిస్తున్న అన్‌స్టాపబుల్‌ (ఆహ) ప్రోగ్రాం నిర్వాహకులు గ్రామస్తులను డిసెంబర్‌ 26న ఆహ్వానించారు. కార్యక్రమానికి సినీనటుడు పవన్‌కళ్యాణ్‌ మఖ్య అతిథిగా హాజరయ్యారు. 

తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి తోడసం శంభు గ్రామానికి చెందిన గ్రామ పటేట్‌ లింభారావ్‌ పటేల్, జెత్‌రావు, జైతు ఈ ప్రోగ్రాంకు వెళ్లి గ్రామంలోని గిరిజనుల దీనస్థితిని వివరించారు. దీంతో గ్రామస్తులకు ఆహ ప్రోగ్రాం నుంచి రూ.లక్ష చెక్కును బాలకృష్ణ, పవన్‌కళ్యాణ్‌ అందజేశారు. త్వరలో గ్రామానికి వెలుగునిచ్చేందుకు సోలార్‌ సిస్టమ్‌ ఏర్పాటు చేయిస్తామని ప్రోగ్రాం తరఫున హామీ ఇచ్చారు. గ్రామాభివృద్ధికి రూ.లక్ష చెక్కు, చీకటిలో మగ్గుతున్న చాకిరేవు గ్రామానికి వెలుగునిచ్చేందుకు సోలార్‌ సిస్టం ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్న అన్‌స్టాపబుల్‌ (ఆహ) ప్రోగ్రాం నిర్వాహకులు, హీరో బాలకృష్ణకు గ్రామస్తులు ధన్యవాదాలు తెలిపారు. 

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు