నవీకరణ.. నవ్విపోదురు గాక!

18 Jul, 2022 08:07 IST|Sakshi

∙రేషన్‌ కార్డుల్లో ‘మార్పులు, చేర్పుల’కు మోక్షం లేనట్లేనా? ∙అయిదేళ్లుగా పెండింగ్‌లోనే దరఖాస్తులు ∙ఆన్‌లైన్‌లో ఆగని దరఖాస్తుల నమోదు ప్రక్రియ ∙గ్రేటర్‌ పరిధిలో వీటి సంఖ్య 2.13 లక్షలకుపైనే..   ∙సర్కిల్‌ కార్యాలయాల చుట్టూ పేదల చక్కర్లు  ∙ప్రభుత్వం నుంచి లభించని గ్రీన్‌ సిగ్నల్‌  

సరూర్‌నగర్‌కు చెందిన ఆటో డ్రైవర్‌ మలయ్యకు అయిదుగురు సంతానం. రేషన్‌ కార్డులో కుటుంబ సభ్యులుగా భార్యాభర్తలతోపాటు మరో ఇద్దరి (పిల్లల) పేర్లు మాత్రమే ఉన్నాయి.  అయిదేళ్ల క్రితం మిగిలిన కుటుంబ సభ్యుల పేర్ల నమోదు కోసం మీ సేవ ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటి వరకు కుటుంబ సభ్యుల జాబితాలో మిగతావారి పేర్లు చేరలేదు. దీంతో నెలవారీ రేషన్‌ బియ్యంతో పాటు వివిధ రెవెన్యూ ధ్రువీకరణ పత్రాలకు సైతం ఇబ్బందులు తప్పడం లేదు. 

సాక్షి హైదరాబాద్‌: గత అయిదేళ్లుగా ఆహార భద్రత (రేషన్‌ ) కార్డులో నవీకరణ (మార్పులు, చేర్పులు) కోసం ఆన్‌లైన్‌ ద్వారా నమోదైన దరఖాస్తులు పెండింగ్‌లో మగ్గుతూనే ఉన్నాయి.  పౌరసరఫరా శాఖ అధికార లాగిన్‌లో కార్డులోని యూనిట్లు (పాత సభ్యులు) తొలగించేందుకు అవకాశం ఉన్నప్పటికీ కొత్త యూనిట్ల (అదనపు సభ్యులు)ను ఆమోదించేందుకు అనుమతి లేకుండా పోయింది.

కుటుంబ సభ్యుల సంఖ్య పెరుగుతున్నా కార్డుల్లో యూనిట్లు (సభ్యులు) పెరగకపోవడం పేదల పాలిట శాపంగా పరిణమించింది. రాష్ట్ర ఆవిర్భావానంతరం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తెల్ల రేషన్‌ కార్డులు రద్దు చేసి వాటిని పూర్తిగా ఆహార భద్రత కార్డులుగా బదిలీ చేసింది.  కొత్తగా దరఖాస్తు చేసుకున్న అర్హులందరికీ కార్డులు మంజూరు చేసింది. ఏడాది పాటు కార్డులో చేర్పు లు, మార్పులు ప్రక్రియ సైతం కొనసాగించి అర్ధంతరంగా నిలిపివేసింది. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రి య మాత్రం కొనసాగిస్తోంది. దీంతో రోజురోజుకూ దరఖాస్తుల సంఖ్య పెరుగుతూనే వస్తోంది. 

ధ్రువీకరణ పత్రాలకు తిప్పలు.. 
పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులకు సంక్షేమ ఉపకాల వేతనాల కోసం తిప్పలు తప్పడం లేదు. ఉపకార వేతనాల కోసం కుటుంబ ఆదాయ ధ్రువీకరణ పత్రం తప్పనిసరి. రెవెన్యూ అధికారులు వార్షిక ఆదాయ నిర్ధారణ కోసం రేషన్‌ కార్డును ప్రామాణికంగా పరిగణించి  ధ్రువీకరణ పత్రాన్ని మంజూరు చేస్తారు. రేషన్‌ కార్డులో పేర్లు లేని కారణంగా ధ్రువీకరణ పత్రం జారీ సమస్యగా తయారైంది. ఆదాయ ధ్రువీకరణ పత్రాలు లేక సంక్షేమ ఉపకార వేతనాలకు అర్హత కోల్పోతున్నారు. 

అయిదేళ్ల వయసు దాటితే..  
ఆహార భద్రత చట్టం ప్రకారం కుటుంబంలోని సభ్యుల వయసు అయిదేళ్లు పైబడితేనే యూనిట్‌గా పరిగణిస్తారు. కార్డులు మంజూరైన నాటికి అయిదేళ్లలోపు సభ్యులు అర్హత సాధించలేక పోయారు. ఆ తర్వాత సభ్యులుగా చేరి్పంచేందుకు దరఖాస్తు చేసుకుంటే నమోదు ప్రక్రియ మాత్రం ముందుకు సాగని పరిస్థితి నెలకొంది. కార్డు కలిగిన కుటుంబాల్లో కొత్త సభ్యుల సంఖ్య పెరుగుతున్నా.. కార్డులో మాత్రం యూనిట్లుగా నమోదు కాని పరిస్థితి నెలకొంది.

గ్రేటర్‌ జిల్లాల పరిధిలో సుమా రు 2.13 లక్షల కుటుంబాల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్లు పౌరసరఫరాల శాఖ అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అందులో కనీసం క్షేత్ర స్థాయి విచారణలో 55 శాతానికిపైగా దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా, విచారణ పూర్తయి ఏఎస్వో లు, ఎమ్మార్వో లాగిన్‌లో 25 శాతం దరఖాస్తులు, డీఎస్వో లాగి¯న్‌లో 20 శాతం దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్లు ఆన్‌లైన్‌ నివేదిక స్పష్టం చేస్తోంది. 

(చదవండి: ఇంజనీరింగ్‌ పట్టాతో ఎగిరిపోవాల్సిందే.. ఉద్యోగం వచ్చినా వద్దే వద్దు)
 

మరిన్ని వార్తలు